సహారా, బిర్లా డైరీల కేసులో మోడీకి ఊరట: కేసును విచారించలేమన్న సుప్రీం
సహారా డైరీల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణ ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: సహారా డైరీల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణ ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును విచారించలేమని తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహారా, బిర్లా కంపెనీల నుంచి ఆయనకు ముడుపులు అందాయన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
గత నవంబర్ 14న విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే తాజాగా సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ పై కోర్టు మరోసారి విచారణ జరిపింది.
సాక్ష్యాలేవీ చూపకపోయినా సహారా, బిర్లా డైరీలలో పేర్కొన్న విషయాల ఆధారంగా అందులో ఉన్న వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఏదైనా నేరం చేస్తే ఆ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పిన విషయాన్ని ఆయన తన పిటిషన్ లో గుర్తు చేసారు.
అయితే, ప్రభుత్వం తరుపున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదిస్తూ.. కార్పొరేట్ల నుంచి మోడీ ముడుపులు తీసుకున్నట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని, ఇలాంటి పత్రాలను లీగల్ ఎవిడెన్స్ గా పరిగణించడం దేశ భద్రతకే ముప్పని వ్యాఖ్యానించారు.
2013, 2014 సంవత్సరాలలో సీబీఐ, ఐటి శాఖ అధికారులు సహారా, బిర్లా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి సేకరించిన పత్రాలనే సహారా డైరీలుగా పరిగణిస్తున్నారు. వాటిలో అప్పటి గుజరాత్ సీఎం మోడీ, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ లతో పాటు పలు ఇతర పార్టీల నేతల పేర్లు కూడా ఉన్నాయి.