మళ్లీ ముగ్గురు ఉగ్రవాదుల చొరబాటు.. ముంబైలో హై అలర్ట్.. ఎప్పుడేం జరుగుతుందో?
ముగ్గురు ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ముంబైలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో హై అలర్ట్ ప్రకటించింది. అనుమానం ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి.
ముగ్గురు ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ముంబైలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో కూడా కొంతమంది ఉగ్రవాదులు ఇలాగే సముద్ర మార్గం గుండా వచ్చి ముంబైలో దారుణ మారణకాండ సృష్టించిన విషయాన్ని ఇంకా భారతావని మరువనేలేదు.
మళ్లీ ఇప్పుడు ముంబైలో ఐసిస్ ఉగ్రవాదులు దాడికి తెగబడే ప్రమాదం ఉన్నట్లు ఇంటెలిజన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అని ముంబై వాసులు ఆందోళన చెందుతున్నారు.
ముంబై పోలీసులు కూడా అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తున్నారు. ముంబైలోకి ప్రవేశించిన ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయబోతున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వారేదైనా అఘాయిత్యాన్ని తలపెట్టేందుకు వచ్చారా? లేక దేశంలో అక్కడక్కడా పాతుకుపోయి ఉన్న వారి సానుభూతిపరులను కలుసుకుని మళ్లీ దారుణ మారణకాండకు తెగబడే యోచన చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా దొంగచాటుగా వచ్చి , ముంబైలోకి చొరబడి దాడులకు తెగబడడం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలోనూ లష్కర్-ఎ-తోయీబా ఉగ్రవాద సంస్థకు చెందిన పది మంది ముష్కరులు ఇలాగే ముంబైలోకి ప్రవేశించి ఎంతటి మారణహోమం సృష్టించారో యావత్ దేశ ప్రజానీకం స్మతిపథం నుంచి ఇంకా చెరిగిపోలేదు.
మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఐసిస్ సృష్టిస్తున్న సమస్యలు కూడా కొత్తేం కాదు. ఆ రాష్ట్రం నుంచి నలుగురు యువకులు ఆ ఉగ్రవాద సంస్థలో చేరడం కోసం ఇరాక్ కు వెళ్లారు. వారిలో అరీబ్ మజీద్ అనే ఒక యువకుడు తిరిగి రావడం, అక్కడ జరుగుతున్న బాగోతాన్ని వివరించడంతో ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాల గురించి కొంత వరకు సమాచారం మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వద్ద ఉంది.
బుధవారం దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకల నేపథ్యంలో.. నిఘా వర్గాల నుంచి ఈ మేరకు హెచ్చరికలు అందడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఉగ్రవాద మూకకు ఈసారి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదనే యోచనతో సముద్ర తీరం వెంబడి గస్తీని కూడా పెంచారు. ముంబైలోని అనుమానిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తున్నారు.