Covaxin: భారత్ బయోటెక్కు గుడ్న్యూస్: రెండేళ్ల చిన్నారులకూ కరోనా టీకా
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్.. మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ బయోటెక్ తన పరిశోధనల్లో మరింత పురోగతిని సాధించింది. కోవాగ్జిన్ సృష్టికర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఫార్మా కంపెనీ.. దాన్ని మరింత అభివృద్ధి చేసింది. రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల లోపు వారికి కూడా కోవాగ్జిన్ను వ్యాక్సిన్ను ఇచ్చేలా దాన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ను త్వరలోనే ఆరంభించబోతోంది.
Recommended Video
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లన్నీ 18 ఏళ్లకు పైనున్న వయస్సు వారికే అందజేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా కూడా ఏ దేశంలోనూ 18 ఏళ్లలోపు వయస్సున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వట్లేదు. ఇటీవలే ఫైజర్-బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను 12 ఏళ్లకు పైనున్న వయస్సు గల వారికి ఇవ్వడానికి అమెరికా అనుమతి ఇచ్చింది. దీనిపై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదముద్ర తెలిపింది.
ఈ క్రమంలో- భారత్ బయోటెక్.. ఫైజర్ కంటే పురోభివృద్ధిని కనపరిచింది. రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సున్న వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేలా కోవాగ్జిన్ను డెవలప్ చేసింది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టబోతోంది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టడానికి సబ్జెక్ట్ టు ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) భారత్ బయోటెక్కు అనుమతి ఇచ్చింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టడానికి అనుమతి ఇవ్వొచ్చిన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సిఫారసు చేసింది. ఇక డీసీజీఐ అనుమతి మాత్రమే మిగిలి ఉంది. మరో నాలుగైదు రోజుల్లో భారత్ బయోటెక్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్కు డీసీజీఐ అనుమతి ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.