ఒక్క ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి 34 మంది వైద్యుల మృతి
న్యూఢిల్లీ: సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి బారినపడి ఒక్క ఏప్రిల్ నెలలోనే 34 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సోమవారం వెల్లడించింది. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల యువ వైద్యుడు కూడా ఈ 34 మందిలో ఉన్నారని తెలిపింది.
మరో ఇద్దరు 30 ఏళ్ల వయస్కులని ఐఎంఏ వెల్లడించింది. సెకండ్ వేవ్లో కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వైద్యులలో 50-70 ఏళ్ల మధ్య వయస్సున్నవారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. 40-49 ఏళ్ల వయస్కులైన వైద్యులు కూడా కరోనా బారినపడి మరణించారని వెల్లడించింది.
మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ఐదుగురు చొప్పున వైద్యులు మరణించగా, ఢిల్లీలో నలుగురు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు వైద్యులు మృతి చెందారని తెలిపింది. చనిపోయిన వైద్యుల కరోనా వ్యాక్సిన్ స్టేటస్ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఐఎంఏ సీనియర్ మెంబర్ రవి వాంఖేడ్కర్ తెలిపారు.
మనదేశంలో జనవరి 16 నుంచి వైద్యారోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. 80 శాతం వైద్య సిబ్బంది ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని కేంద్రం ఇటీవల వెల్లడించింది. కాగా, గత సంవత్సరం కరోనా బారినపడి 730 మంది వైద్యులు మరణించారని ఐఎంఏ తెలిపింది.
కరోనాతో మృతి చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది కుటుంబాలకు ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద రూ. 50 లక్షలు అందించే బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 287 మంది వైద్య సిబ్బందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.