ఎయిరిండియా విమానంలో మహిళ దుప్పటిపై మూత్రం పోశాడు! 2 నెలల్లో రెండో ఘటన
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్న సమయంలోనే మరో ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.
విమానంలో ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రం పోశాడు
నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో బిజినెస్ క్లాస్లో ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటన అందర్నీ షాకింగ్ కు గురిచేయగా.. ఇప్పుడు మరో ఘటన కూడా చోటు చేసుకోవడం మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. డిసెంబర్ 6న ప్యారిస్-ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే, అతడు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.
మద్యం మత్తులోనే.. క్షమాపణలు చెప్పాడు
డిసెంబర్ 6న ఉదయం 9.40 గంటలకు విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. మద్యం మత్తులో ఉన్న నిందితుడు క్యాబిన్ సిబ్బంది సూచనల్ని పట్టించుకోకుండా.. ఓ మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రం పోశాడని భ్రదతా సిబ్బందికి ఫిర్యాదు అందింది. దీంతో అతడు విమానం దిగగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రయాణికులిద్దరి మధ్య రాజీ కూదరడం, నిందితుడు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు.
నిందితుడిపై చర్యలేవీ?: డీజీసీఏ ఆగ్రహం
తొలుత రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది మహిళ. అయితే, పోలీసు కేసు పెట్టేందుకు నిరాకరించడంతో ఇమ్మిగ్రేషన్, కమస్టమ్స్ ఫార్మాలటీలను పూర్తి చేసి నిందితుడిని వదిలేసినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ఇది ఇలావుండగా, నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ విమానంలో ఓ మహిళపై మూత్రం పోసిన నిందితుడిపై చర్యలు తీసుకోకపోవడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఎయిరిండియా ప్రవర్తన సరిగాలేదని తప్పుబట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించింది. ఈ మేరకు ఎయిరిండియా అధికారులు, ఆ విమానం సిబ్బందికి గురువారం డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. రెండు నెలల్లోనే ఇలాంటి రెండు ఘటనలు వెలుగుచూడటంతో ప్రయాణికులు కూడా విమాన సిబ్బంది, అధికారుల వ్యవహారంపై మండిపడుతున్నారు.