‘సెక్యూలర్’తో దేశం నాశనం: కాంగ్రెస్పై యోగి నిప్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం నుంచి వినిపిస్తున్న 'లౌకికతత్వం'(సెక్యూలర్) అనే పదం అతి పెద్ద అబద్దమని అన్నారు. దేశాన్ని ఈ పదం సర్వనాశనం చేసిందని వ్యాఖ్యానించారు.
అది పెద్ద నేరం
చరిత్రను తప్పుగా చెప్పడం రాజ ద్రోహం కంటే పెద్ద నేరమని యోగి అన్నారు. ఎవరినైనా ఉద్దేశించి ‘పాకీ' అనే పదాన్ని వాడితే యూరప్లో ఘోరమైన అవమానంగా భావిస్తారని వెల్లడించారు. దైనిక్ జాగరణ్ గ్రూప్ రాయ్పూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆదిత్యనాథ్.. కమ్యూనలిజమ్, సెక్యులరిజమ్లపై ఎదురైన ప్రశ్నలకు సమాధానంగా పై వ్యాఖ్యలు చేశారు.
క్షమాపణ చెప్పాల్సిందే..
సెక్యులరిజమ్ అనే పదాన్ని సృష్టించిన వారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సివుంటుందని యోగి వ్యాఖ్యానించారు. ఏ వ్యవస్థా కూడా లౌకికతత్వాన్ని పాటించలేదని చెప్పారు. రాజకీయ వ్యవస్థ న్యూట్రల్గా మాత్రమే ఉండగలదని అన్నారు. ఒకే విధానంతో ప్రభుత్వం నడవాలని ఎవరైనా చెప్పినా అది సాధ్యపడదని అన్నారు.
నాశనం నా ఉద్దేశం కాదు
ముఖ్యమంత్రిగా ఉన్న తాను 22 కోట్ల మంది ప్రజల భద్రతకు, వారి భావాలకు సమాధానం ఇవ్వాల్సివుంటుందని యోగి స్పష్టం చేశారు. ఒక కమ్యూనిటీని నాశనం చేసేందుకు తాను సీఎం కుర్చీలో కూర్చొలేదని చెప్పారు. పాకిస్థాన్, పాకీ అనే పదాలను యూరప్లో వినియోగిస్తే అవమానంగా భావిస్తారని అన్నారు.
కాంగ్రెస్దే పాపం
దేశంలో టెర్రరిజం, నక్సలిజం, వేర్పాటువాదాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కోట్ల మంది ప్రజల భావాలతో కాంగ్రెస్ ప్రభుత్వ ఆడుకుందని అన్నారు. స్వార్థంతో దేశాన్ని విడగొట్టిన పాపం కూడా కాంగ్రెస్ మూటగట్టుకుందన్నారు. కుల, మత, భాషల ప్రతిపాదికన దేశాన్ని చీల్చిన కాంగ్రెస్ పాపం ఊరికేపోదన్నారు.
రామరాజ్యం.. మోడీపై ప్రశంసలు
దేశం మొత్తం వసుధైక కుటుంబంలా ఉండాలే తప్ప ఇలా చిన్నభిన్నంగా ఉండకూడదని చెప్పారు. మోడీ ప్రభుత్వాన్ని రామ రాజ్యంతో పోల్చుతూ.. ప్రజల బాధలు అర్థం చేసుకునే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజలకు మంచి రోజులను తీసుకొస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మనోభావాలతో దెబ్బతీస్తోందిన యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు.