నెత్తిన వంట గ్యాస్ "బండ" - రూ.100 మేర పెంపు : రేషన్ దుకాణాల్లో చిన్న సిలిండర్లు..!!
ఇప్పటికే నిత్యావసర వస్తువులు- పెట్రో ఉత్పత్తుల ధరలతో సతమతం అవుతున్న వేళ..మరో పిడుగు సామాన్యుడిపైన పడేందుకు సిద్దం అవుతోంది. కొంత కాలంగా వంట గ్యాస్ ధరల్లో సైతం హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల వేళ సైతం వంట గ్యాస్ ధరలు పెంచేందుకు రంగం సిద్దమైందంటూ బీజేపీ పైన ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. సిలిండర్లను ప్రచార సభల వద్ద ఉంచి మరీ తమ ప్రచారం నిర్వహించాయి. అయితే, ఇక ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు ఖాయంగా కనిపిస్తోంది.
పెరుగుతున్న ధరలతో ఉక్కిరి బిక్కిరి
వచ్చే వారం లో వంట గ్యాస్ తో పాటుగా మరోసారి పెట్రోలు, డీజిల్ రేట్లు కూడా పెరగక తప్పదని కేంద్రం నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఈ నెల ఆరో తేదీనే సిలిండర్పై రూ.15 పెరిగింది. జులై నుంచి లెక్కిస్తే విడతల వారీగా మొత్తం రూ.90 పెరిగినట్లయింది. ఈ నెలలో సౌదీలో గ్యాస్ ధరలు 60 శాతం మేర పెరిగాయి. టన్ను ధర 800 డాలర్లు (సుమారు రూ.60 వేలు) పలుకుతోంది. అందువల్ల సిలిండర్ ధర రూ.వందకుపైగానే పెరిగింది.
ఒక్కో సిలిండర్ పైన రూ 100 వరకు పెంపు
అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన దృష్ట్యా సిలిండర్పై రూ.100 మేర నష్టం వస్తోందని, దాన్ని భర్తీ చేసుకోవడానికి రేటు పెంచక తప్పదని చమురు కంపెనీలు అంటున్నాయి. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమేరకు పెంచాలన్నదానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. సబ్సిడీ వంట గ్యాసుకు సంబంధించి ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకొని సబ్సిడీ అమలు చేస్తుంది. ఆ సబ్పిడీ మొత్తాన్ని కేంద్రం ఆయిల్ కంపెనీలకు రీయంబర్స్ చేస్తుంది.
కేంద్రం సబ్సిడీ ఇస్తుందా..
అయితే, ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఆయిల్ కంపెనీలకు దీని పైన ఎటువంటి ప్రతిపాదన రాలేదని తెలుస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడంతో అవి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ మారుతుంటాయి. గ్యాస్ ధరలు నియంత్రణ పరిధిలోనే ఉన్నా, రాయితీని దాదాపుగా ఎత్తివేసింది. కొనుగోలు ధరతో సమానంగా ఉండేలా అమ్మకం ధరను దఫదఫాలుగా పెంచుతూ వస్తోంది. సబ్సిడీని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే సిలిండర్ ధరలు పెంచుతామని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
కేంద్రం నిర్ణయం పైనే అందరి చూపు
పెంపు మరీ ఎక్కువగా ఉండబోదని, మధ్యస్థంగా ఉంటుందని తెలిపాయి. దిల్లీ, ముంబయిల్లో 14.2 కిలోల సబ్సిడీ వంట గ్యాసు సిలిండర్ ధర రూ.899.50గా ఉంది. కోల్కతాలో రూ.926 పలుకుతోంది. సంవత్సరానికి 12 సిలిండర్లను ఈ సబ్సిడీ ధరపై అందిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకంగా రూ వంద చొప్పున వంట గ్యాస్ సిలిండర్ల పైన ధరలు పెంచితే సామాన్యాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం కావటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..కేంద్రం ముందుకు వచ్చి కొంత మేర సబ్సిడీ భరించటానికి సిద్దం అవుతుందా.. లేక, ఆయిల్ కంపెనీలకే నిర్ణయాన్ని వదిలేస్తుందా అనేది చూడాల్సి ఉంది.
దీపావళి తరువాత పెంపు నిర్ణయం
దీపావళి తరువాత వంట గ్యాస్ ధర పెంపు పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో కొత్త ప్రతిపాదన తెర పైక వచ్చింది. రేషన్ దుకాణాలను లాభసాటిగా మార్చడానికి వాటి ద్వారా చిన్న గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక లావాదేవీలు జరిపే సేవలను కూడా అందించే ఏర్పాట్లు చేయనుంది. కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే..చమురు కంపెనీల ప్రతినిధులు, ఐటీ, ఆర్థిక, పెట్రోలియం శాఖల అధికారులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు చర్చలు జరిపారు.
Recommended Video
రేషన్ దుకాణాల్లో చిన్న సిలిండర్లు
పెట్టుబడుల నిమిత్తం రేషన్ డీలర్లకు 'ముద్ర' రుణాలు అందించాలని కూడా కేంద్రం ఆలోచిస్తోంది. ఈ విషయమై డీలర్లకు అవగాహన కలిగించాలని రాష్ట్రాలకు సూచించింది. అయితే, సాధారణంగా వినియోగించే వంట గ్యాస్ సిలిండర్లు 14.2 కిలోల విషయంలో మాత్రం ధర కీలకం కానుంది. ఒకే సారి వంద రూపాయాలు పెంచుతారా..దశల వారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు కేంద్రం నిర్ణయించాల్సి ఉంది.