బీజేపీలోకి శివసేన మంత్రి ప్రభు,దత్తాత్రేయకి పర్యావరణం
న్యూఢిల్లీ/ముంబై/హైదరాబాద్: ఆదివారం మధ్యాహ్నం కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన పార్లమెంటు సభ్యుడు సురేష్ ప్రభు ఆ పార్టీ అధ్యక్షులు ఉద్ధవ్ థాకరేకు ఝలక్ ఇచ్చారు. సురేష్ ప్రభు ఇటీవలి ఎన్నికల్లో శివసేన పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు. ఆయన ఉదయం బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. శివసేనకు రాజీనామా చేశారు.
కేబినెట్లో శివసేనకు రెండు పదవులు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. దీంతో అనిల్ దేశాయ్కి కేబినెట్ హోదా, సురేశ్ ప్రభుకు సహాయ మంత్రి పదవులివ్వాలని ఉద్ధవ్ థాకరే మోడీకి సూచించారు. అయితే సురేశ్ ప్రభుకు కేబినెట్ హోదా, అనిల్కు సహాయ మంత్రి పదవి ఇస్తున్నారన్న సమాచారంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే.. అనిల్ను వెనక్కి రప్పించారు.
ఈ నేపథ్యంలో సురేష్ ప్రభు శివసేనకు రాజీనామా చేశారు. ఆయన ఉదయమే బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. సురేష్ ప్రభుకు రైల్వే శాఖను అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఆర్థిక వ్యవహారాల నిపుణిడిగా సురేష్ ప్రభుకు పేరుంది. గతంలో వాజపేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు.
దత్తాత్రేయకు అడవులు, పర్యావరణం?
తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ నుండి గెలుపొంది.. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బండారు దత్తాత్రేయకు ఇచ్చే శాఖ పైన పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు కార్మిక శాఖ ఇవ్వవచ్చునని తొలుత వార్తలు వచ్చాయి. తాజాగా.. అడవులు, పర్యావరణ శాఖ ఇవ్వవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఏ పదవి ఇచ్చిన సమర్థవంతంగా బాధ్యత నిర్వహిస్తానని బండారు దత్తాత్రేయ ఢిల్లీలో చెప్పారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో ఊరూరా తిరిగి బీజేపీని ప్రత్యామ్నాయంగా చేస్తామన్నారు.
కేసీఆర్ హర్షం
దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సరిగ్గా ఆ సమయంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలంగాణ సర్కారు పౌర సన్మానం చేసింది. ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరైన కేసీఆర్.. దత్తాత్రేయకు మంత్రి పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.