హస్తిన రాజకీయాల్లో అనూహ్య ప్రకంపనలు: దెబ్బకు అధికార పార్టీ కుదేల్..!!
Kailash Gahlot: దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలో భూకంపం సంభవించింది. అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. ఇంకో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ పరిణామాలు అధికార పార్టీని కుదేల్ చేశాయి. ఉక్కిరిబిక్కిరికి గురి చేసినట్టయింది.
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి కైలాష్ గెహ్లాట్.. తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పంపించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు.

ముఖ్యమంత్రి ఆతిషి సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో కీలక శాఖలను పర్యవేక్షిస్తోన్నారు కైలాష్ గెహ్లాట్. రవాణా, పాలన సంస్కరణలు, ఐటీ, హోం, మహిళా శిశుసంక్షేమ శాఖలు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. హఠాత్తుగా ఆయన రాజీనామా చేయడం, కేజ్రీవాల్కు సుదీర్ఘ లేఖ రాయడం ప్రకంపనలు పుట్టిస్తోంది.
మంత్రివర్గం అనేది ఓ అద్దాల మేడలా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన.ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని కైలాష్ గెహ్లాట్ ఈ లేఖలో పేర్కొన్నారు. యమునా నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామంటూ ప్రజలకు వాగ్దానం ఇచ్చామని, దాన్ని నెరవేర్చలేకపోతున్నామని తేల్చి చెప్పారు.
హామీలను అమలు చేయకపోవడం వల్ల సామన్యులు పార్టీ, మంత్రులు, అధికార యంత్రాంగాన్ని నిలదీసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. క్రమంగా సామాన్యుల నమ్మకాన్ని పోగొట్టుకుంటోన్నామని కైలాష్ గెహ్లాట్ చెప్పారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంతో కొట్లాడటానికే పార్టీ, ప్రభుత్వం సమయం మొత్తం కేటాయిస్తోందని ఆరోపించారు.
ఈ పరిస్థితుల్లో తనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేయడం మినహా మరో మార్గం లేదని కైలాష్ గెహ్లాట్ స్పష్టం చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన అరవింద్ కేజ్రీవాల్కు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications