కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాజీనామా: కుమారుడు బీజేపీలో చేరడంతో మనస్తాపం!
ముంబై: లోక్ సభ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని విఘాతం తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీఖే పాటిల్ మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందజేశారు. నైతిక కారణాల వల్ల తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వీఖే పాటిల్ ఈ పత్రంలో పేర్కొన్నారు.
జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి ఆకుల రాజీనామా:మాగంటి రూప గెలుపు కోసం టీడీపీతో లోపాయకారి ఒప్పందాలే కారణమా?
రాధాకృష్ణ వీఖే పాటిల్ కుమారుడు, న్యూరోసర్జన్ స్పెషలిస్ట్ సుజయ్ వీఖే పాటిల్ కొద్దిరోజుల కిందటే భారతీయ జనతాపార్టీ తీర్థాన్ని పుచ్చుకున్న విషయం తెలిసిందే. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాధాకృష్ణ పార్టీని వీడినట్లు చెబుతున్నారు. రాధాకృష్ణ దగ్గరుండి తన కుమారుడిని బీజేపీలో చేర్పించారంటూ కాంగ్రెస్ పొత్తు పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో ఉద్దేశపూరకంగా జాప్యం చేస్తున్నారంటూ ఎన్సీపీ నాయకులు ఆరోపించారు.
అహ్మద్ నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోయే తన కుమారుడు సుజయ్ కు వ్యతిరేకంగా తాను పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేనని రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఆయా కారణాల వల్లే తాను బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పారు. సుజయ్ వీఖే పాటిల్ బీజేపీలో చేరడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుపట్టారు. రాధాకృష్ణ వీఖే పాటిల్ ఏ పార్టీ వైపు ఉన్నారో స్పష్టం చేయాలంటూ విమర్శలు గుప్పించారు.