భారత్లో సీరం కరోనా వ్యాక్సిన్ ధర రూ.250- త్వరలో కేంద్రంతో ఒప్పందానికి ఏర్పాట్లు
భారత్లో కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కేంద్రం నమ్మకంగా చేస్తున్న ప్రకటనలు వాస్తవ రూపం దాల్చేలా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్లో కరోనా వ్యాక్సిన్ విక్రయానికి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంస్ధలతో కలిసి పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ తో పాటు అమెరికాకు చెందిన ఫైజర్, భారత్కే చెందిన భారత్ బయోటెక్ కూడా సిద్ధమవుతున్నాయి.
Recommended Video
వీరిలో ఎవరి నుంచి కేంద్రం వ్యాక్సిన్ కొనుగోలు చేయబోతోందన్న ఉత్కంఠ రేగుతోంది. అయితే తాజాగా తమకు అనుమతి ఇవ్వాలంటూ ఈ మూడు సంస్ధలు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో సీరం ఇన్స్టిట్యూట్ మరో అడుగు ముందుకేసి తమ వ్యాక్సిన్ రేటు కూడా ప్రకటించేందుకు సిద్ధమైంది.

భారత్లో సీరం వ్యాక్సిన్ ధర రూ.250
భారత్లో కరోనా వ్యాక్సిన్ సరఫరా కోసం ఉవ్విళ్లూరుతున్న పూణేకు చెందిన దేశీయ సంస్ద సీరం ఇన్స్టిట్యూట్ తమ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయని ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాటు అత్యవసర కేసుల్లో వ్యాక్సిన్ సరఫరా కోసం కేంద్రాన్ని అనుమతి కోరింది. దీంతో పాటు వ్యాక్సిన్ ధర కూడా తాజాగా సిద్ధం చేసింది. భారత్లో కేంద్రానికి ఈ వ్యాక్సిన్ను రూ.250 రూపాయలకే అమ్మాలని సీరం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమెరికాలో దీన్ని 3.39 డాలర్లకు అక్కడి ప్రభుత్వానికి విక్రయిస్తారు. త్వరలో సీరం దీనిపై ఓ అధికారిక ప్రకటన చేయబోతోంది.

త్వరలో కేంద్రంతో ఒప్పందానికి ఏర్పాట్లు..
భారత్లో కరోనా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ముందున్న మూడు ఆప్షన్లలో సీరం ఇన్స్టిట్యూట్ ఆక్స్ఫర్డ్ వర్శిటీ, ఆస్ట్రాజెనెకా సాయంతో తయారు చేస్తున్న వ్యాక్సిన్ ముఖ్యమైనది. దీంతో కేంద్రం కూడా దీన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్లో అత్యవసర పరిస్ధితుల్లో వాడేందుకు తమ వ్యాక్సిన్కు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని మూడు సంస్ధలు కోరాయి. ఇందులో భారత్కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్తో పాటు అమెరికాకు చెందిన ఫైజర్ సంస్ధలున్నాయి. వీటిలో సీరం ఇన్స్టిట్యూట్కు ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్ డోసులు తయారుచేస్తున్న సంస్ధగా గుర్తింపు ఉంది. దీంతో కేంద్రం కూడా సీరం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో సీరంతో ఒక్కో వ్యాక్సిన్ రూ.250కు పంపిణీ చేసేలా ఒప్పందం జరిగే అవకాశముంది.

వ్యాక్సిన్ భారత్కు ఇచ్చాకే ఇతర దేశాలకు
భారత్లో వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రంతో త్వరలో ఒప్పందానికి సీరం ఇన్స్టిట్యూట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్ డోసుల తయారీ దారుగా తమకున్న ట్రాక్ రికార్డుతో కచ్చితంగా ఈ కాంట్రాక్టు తమకే దక్కుతుందని సీరం భావిస్తోంది. అయితే భారత్లో ముందుగా వ్యాక్సిన్ సరఫరా ప్రారంభించాలని, ఆ తర్వాతే ఇతర దేశాలకు విక్రయిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో ఆధర్ పూనావాలా తాజాగా ప్రకటించారు. వాస్తవానికి భారత్లోనే 30 కోట్ల మందికి తొలి విడత వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తున్నందున ముందుగా ఇక్కడే సరఫరా చేయాల్సి ఉంటుందని సీరం అంచనా వేస్తోంది. ఆ తర్వాత తమ భాగస్వాములు ఉన్న బ్రిటన్కు దీన్ని సరఫరా చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications