కాంగ్రెస్కు షాక్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ టీఎంసీలో చేరిక
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)లో చేరారు. కోల్కతాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన టీఎంసీ కండువా కప్పుకున్నారు.
టీఎంసీలో చేరేందుకు అభిజిత్ ముఖర్జీ గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక, ఇటీవల కోల్కతాలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని కలిశారు. అంతేగాక, కోల్కతాలో చోటు చేసుకున్న నకిలీ టీకా కార్యక్రమంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు.
నకిలీ టీకా కార్యక్రమానికి మమతా బెనర్జీని నిందిస్తే.. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ చేసిన కుంభకోణాలకు మోడీని బాధ్యుల్ని చేయాల్సి ఉంటుందని అభిజిత్ వ్యాఖ్యానించారు. దీంతో టీఎంసీలో ఆయన చేరతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన అధికారికంగా టీఎంసీలో చేరారు. అయితే, త్వరలో జరగబోయే జంగిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో టీఎంసీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జంగిపూర్ నుంచి పోటీలో ఉన్న ఓ అభ్యర్థి పోలింగ్కు కొద్ది రోజుల ముందు మృతి చెందడంతో ఆ ఎన్నికను ఈసీ వాయిదా వేసింది.
కాగా, గతంలో ముర్షిదాబాద్లోని జంగిపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి అభిజిత్ రెండు సార్లు కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుపొందారు. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికవడంతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన జంగిపూర్ లోక్సభ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. అప్పుడు కాంగ్రెస్ తరపున అభిజిత్ ముఖర్జీ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొందారు. నల్హతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగాను విజయం సాధించారు.