శ్రీలంకలో బాంబు పేలుళ్లు: 7 మంది జేడీఎస్ నాయకులు మాయం, షాంగ్రిలా హోటల్ లో!
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల మొదటి విడత ఎన్నికల ప్రచారం, పోలింగ్ ముగించుకుని శ్రీలంకకు విహారయాత్రకు వెళ్లిన 7 మంది జేడీఎస్ పార్టీ నాయకులు మాయం అయ్యారు. 7 మంది జేడీఎస్ నాయకుల ఆచూకి లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు జేడీఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆందోళన చెందుతున్నారు.
చిక్కబళ్లాపుర లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలికి మద్దతుగా ప్రచారం చేసిన జేడీఎస్ పార్టీ నాయకులు ఓటు వేసి ఈ నెల 20వ తేదీన శ్రీలంకకు విహారయాత్రకు వెళ్లారు. శ్రీలంకలోని షాంగ్రిలా హోటల్ లోనే 7 మంది బస చేశారని సమాచారం.
శ్రీలంకలో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. శ్రీలంకలోని షాంగ్రియా హోటల్ లో బాంబు పేలుళ్లు జరిగాయి. అదే హోటల్ లో బస చేసిన 7 మంది జేడీఎస్ నాయకుల ఆచూకిలేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
బెంగళూరు ఉత్తర తాలుకాకు చెందిన మారేగౌడ, పుట్టరాజు, బెంగళూరుకు చెందిన హనుమంతరాయప్ప, నెలమంగలకు చోందిన శివణ్ణ, మునియప్ప, లక్ష్మినారాయణ, తుమకూరుకు చెందిన రమేష్ ల ఆచూకి లేదని, వారు అందుబాటులోకి రావడం లేదని వారి సన్నిహితులు ఆందోళన చెందుతున్నారని కన్నడ మీడియా తెలిపింది.