బీ అలర్ట్ : రానున్న రెండ్రోజుల్లో దేశవ్యాప్తంగా వడగాలులు...వాతావరణశాఖ హెచ్చరిక
దేశవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎర్రటి ఎండకు దేశంలోని ప్రజలు పిట్టలు రాలినట్లు రాలుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ దేశంలోని సగం ప్రాంతాలకు హైఅలర్ట్ ప్రకటించింది. హైఅలర్ట్ ప్రకటించిన రాష్ట్రాల్లో విదర్భా, పశ్చిమ రాజస్థాన్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్లు ఉన్నాయి. రానున్న రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇక రానున్న రెండ్రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని దేశంలోని 16 వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీచేశాయి. దేశంలో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆ సమయంలో ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ వడగాలులు ఉంటాయని తెలిపింది వెదర్ డిపార్ట్ మెంట్. ఈ వడగాలులు జూన్ నెలలో కూడా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. విదర్భాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.

ఇదిలా ఉంటే చంద్రాపూర్ విదర్భా ప్రాంతాల్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు ప్రాంతాల్లో టెంపరేచర్ 48 డిగ్రీల సెల్సియస్ను తాకిందని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో వడగాలులు వీచాయని ఆ తర్వాత ఇప్పుడే వీస్తున్నట్లు పూణేలోని వాతావరణకేంద్ర శాఖ అధికారులు తెలిపారు. ఇక ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. పశ్చిమ రాజస్థాన్లో ఎడారి ప్రాంతం నుంచి ఈ వడగాలులు వీస్తున్నాయని చెప్పారు. ఇక ఉత్తర్ ప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న బండా అనే పట్టణంలో అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.
ఆకాశంలో మారుతున్న పరిస్థితులే అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతున్నట్లు కష్యపీ అనే వాతావరణశాఖ అధికారి తెలిపారు. ఆకాశంలో మబ్బులు లేకపోవడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయని దీని ద్వారా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వెల్లడించారు.












Click it and Unblock the Notifications