పదో తరగతి అమ్మాయికి తోటి విద్యార్థుల లైంగిక వేధింపు
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో మరో బాలిక లైంగిక వేధింపులకు గురయింది. ఆమె ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమర్షియల్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్టోరియా లేఔట్లో ఓ పాఠశాలలో ఇది జరిగింది.
కమర్షియల్ స్ట్రీట్ సమీపంలో నివాసం ఉంటున్న బాలిక అక్కడి స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. బాలికను అదే స్కూల్లో చదువుతున్న తోటి విద్యార్థులు లైంగిక వేధింపులకు గురి చేశారు. చాలా రోజుల వరకు ఓపిక పట్టిన ఆమె, ఆ తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.
బాలిక మొబైల్ కు అసభ్యంగా చాల మెసేజ్లు పంపించిన విషయం ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. బయటకు చెబితే పరువు పోతుందని వారు మొదట భావించారు. చివరికి విసిగిపోయిన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి కమర్షియల్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గత రెండు సంవత్సరాల నుండి బాలికను సాటి విద్యార్థులు లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారని, తెలిసీ తెలియని వయస్సులో ఈ విదంగా చేస్తున్నారని ఇంతకాలం ఓపిక పట్టామని, శృతి మించిపోవడంతో ఫిర్యాదు చేయక తప్పడం లేదని ఆరోపించారు.
కాగా, బాలికకు చెప్పిన వివరాల ఆదారాంగా, ఆమె మొబైల్లోని సందేశాల ఆదారంగా కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. పాఠశాలలోని విద్యార్థులు, టీచర్లను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని, ఇప్పటి వరకు ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని, కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.