షాహీన్బాగ్ ఓటు: ఓఖ్లాలో ఆప్ అభ్యర్థి అమనుల్లా ఖాన్ భారీ విజయం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ-ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా సాగుతోంది. మంగళవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 58కిపైగా స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఓఖ్లా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆప్ అభ్యర్థి అమనుత్తాల ఖాన్ భారీ విజయం నమోదు చేశారు. 90వేల ఓట్ల మార్జిన్తో గెలుపొందారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. 11న ఫలితాలు వెలువడుతున్నాయి. ఓఖ్లా నుంచి బీజేపీ అభ్యర్థిగా బ్రహమ్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థిగా పర్వేజ్ హష్మి పోటీ చేసి ఓటమిని చవిచూశారు.
ఓఖ్లాలో బీజేపీ రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. ఓఖ్లాలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే షాహీన్ బాగ్ కూడా ఉంది. ఇక్కడ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు షాహీన్ బాగ్లో ఆందోళనకారులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలంటూ పిలుపునివ్వడం గమనార్హం.
షాహీన్ బాగ్లో వేలు, లక్షల మంది చేరి ఆందోళనలు చేస్తున్నారని.. వారంతా మీ ఇళ్లల్లోకి ప్రవేశించి మీ కూతుర్లు, చెల్లెలను రేప్ చేస్తారని, చంపేస్తారని.. అందుకే ఆలోచించి ఓటేయాలని బీజేపీ ఢిల్లీ వెస్ట్ ఎంపీ పర్వేశ్ వర్మ ఎన్నికల ముందు సంచలన ఆరోపణలు చేశారు. షాహీన్ బాగ్లో పాకిస్థానీలు చేరిపోయారి.. అదో మినీ పాకిస్థాన్లా మారిందని బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా వ్యాఖ్యానించారు. భారత చట్టాలు షాహీన్బాగ్, చాంద్ బాగ్, ఇంద్రలోక్లో పనిచేయడం లేదని, అల్లర్లు సృష్టించేందుకు పాకిస్థానీలు ఢిల్లీ రోడ్లపైకి వచ్చారంటూ ఆరోపణలు చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఢిల్లీలో దాదాపు 60 స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. సర్జికల్ స్ట్రైక్స్తో పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ప్రధాని మోడీ వైపు ఉంటారా? లేక షాహీన్ బాగ్ వెనక ఉన్న వారి వైపు ఉంటారా? ప్రజలు నిర్ణయించుకోవాలని ఆయన ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, షాహీన్ బాగ్ ఆందోళనలకు కేజ్రీవాల్ దూరంగానే ఉన్నారు. వారికి ఆందోళన, నిరసన చేసే హక్కు ఉందని.. అయితే, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తాను అక్కడికి వెళ్లాలంటే తనకు 5 నిమిషాలు కూడా పట్టదని అన్నారు. అయితే, ఢిల్లీ ఓటర్లు మాత్రం తమ స్థానిక సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యతనిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకే తిరిగి పట్టం కట్టడం గమనార్హం.