మహారాష్ట్ర సీఎంపై శరద్ పవార్ పీటముడి.. డిప్యూటీ సీఎంలుగా ఆ ఇద్దరు!
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కొద్దిరోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సర్కార్ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముందుకెళ్తుతుండటంతో సంక్షోభానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా కామన్ మినిమమ్ ప్రొగ్రాంపై మూడు పార్టీల మధ్య అవగాహన ఏర్పడింది. దాంతో పదవుల పంపకంపై కీలక చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మహారాష్ట్రలో చోటుచేసుకొంటున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే..
'డోంట్ వర్రీ!మహారాష్ట్రలో మన ప్రభుత్వమే వస్తుంది: అమిత్ షా’
ప్రభుత్వ ఏర్పాటు దిశగా చకచకా
మీడియా కథనాల ప్రకారం.. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మూడు పార్టీల మధ్య చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు చకచకా పడుతున్నాయి. వారి అలయెన్స్పై అధికారికంగా మాత్రమే ప్రకటన వెలువడాల్సి ఉంది అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఎన్నికల ముందు జరిగిన బీజేపీ, శివసేన ఒప్పందం బెడిసి కొట్టడం, ప్రభుత్వం ఏర్పాటుపై 50-50 ఫార్మూలాపై అవగాహన కుదరకపోవడంతో సర్కార్ ఏర్పాటు విషయం ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కామన్ ఎజెండాపై కసరత్తు
బీజేపీతో తెగతెంపుల తర్వాత శివసేన తాజాగా కాంగ్రెస్, ఎన్సీపీలతో జత కలిసింది. కామన్ మినిమిమ్ ప్రొగ్రాం మూడు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఉద్దవ్ థాకరేనే మహారాష్ట్ర సీఎంగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పట్టుబడుతున్నట్టు సమాచారం. ఒకవేళ సీఎం పదవిని చేపట్టడం ఉద్దవ్కు ఇష్టం లేకపోతే సంజయ్ రౌత్ను నామినేట్ చేయవచ్చు అని శరద్ పవార్ మీడియాతో అన్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం 5 ఏళ్లు పదవిలో ఉంటాడు అని సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేయడం విశేషంగా మారింది.
సీఎంగా ఉద్దవ్ థాకరే అయితే
తాజా సమాచారం ప్రకారం.. ఉద్దవ్ థాకరే గానీ, సంజయ్ రౌత్లో ఎవరో ఒకరు గానీ సీఎం పదవి చేపడితే.. ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, కాంగ్రెస్ నుంచి బాలా సాహెబ్ థోరట్ డిప్యూటీ సీఎం పోస్టును చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం సజావుగా నడవాలంటే ఉద్దవ్ థాకరేనే సీఎంగా ఉండాలని శరద్ పవార్ పట్టుపడుతున్నట్టు సమాచారం.
మహారాష్ట్రలో అనూహ్య పరిణామాలు
మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు చకచక మారుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం దూతలు ఆహ్మద్ పటేల్, మల్లికార్జున్ ఖార్గే, కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు ముంబైకి చేరుకొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చర్చలు పూర్తయినట్టు ప్రకటించారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందు మరోదఫా ఎన్సీపీ, శివసేనతో తుది చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.