పుస్తక రచన: మీడియాకు దూరంగా థరూర్
గురువాయూర్: కేరళలోని గురువాయూర్ సమీపంలోని ఓ ఆయుర్వేదిక్ రిసార్ట్కు చికిత్స నిమిత్తం వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. భార్య సునంద పుష్కర్ మరణంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి థరూర్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆయుర్వేద చికిత్స కేంద్రం అధికారి పెరుంబయిలీ మాన మాట్లాడుతూ థరూర్ చికిత్స నిమిత్తం వచ్చారని, మీడియా ప్రతినిధులను కలిసేందుకు విముఖత చూపుతున్నారని చెప్పారు.
సాధారణంగా తమ రిసార్ట్కు చికిత్స నిమిత్తం రోగులను కలవడానికి బయటవారు ఎవరినీ అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. చికిత్స పూర్తయ్యేవరకూ బయటవారితో మాట్లాడే అవకాశం ఉండదని పెరుంబయిలీ తెలిపారు. థరూర్కు శుక్రవారంతో చికిత్స పూర్తవుతుందని, తరువాత ఎవరితో మాట్లాడేది ఆయన ఇష్టమని ఆయుర్వేదిక్ రిసార్ట్ ఎండీ సాజి కురుప్ అన్నారు. ప్యానెల్ డాక్టర్లు థరూర్కు ఫిజికల్వెల్నెస్ చికిత్స చేస్తున్నారని, ఆయన ఎంతో ఉల్లాంసంగానే గడుపుతున్నారని ఎండి చెప్పారు.
కాగా ఆయన ఖాళీ సమయంలో పుస్తక రచనలో బిజీగా గడుపుతున్నారు. సునంద పుష్కర్ది సహజ మరణం కాదని ఢిల్లీ పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో ఆమె భర్తగా థరూర్ స్పందన కోసం పలు జాతీయ చానళ్లకు చెందిన మీడియా ప్రతినిధులు రిసార్ట్ వద్ద పడిగాపులు పడుతున్నారు.
సునంద పుష్కర్ మృతి కేసులో కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్కు ఎలాంటి లీగల్ నోటీసు పంపలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ స్పష్టం చేశారు. ‘సునంద కేసు దర్యాప్తునకు సంబంధించి థరూర్కు మేం ఎలాంటి నోటీసులు పంపలేదు' అని గురువారం ఇక్కడ తెలిపారు. థరూర్ భార్య సునంద విషప్రయోగం వల్లే చనిపోయిందని నిర్ధారించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దీనికి సంబంధించి దర్యాప్తు అధికారులు మరిన్ని సాక్ష్యాలు సేకరిస్తున్నారని బస్సీ వెల్లడించారు. కేరళలో వైద్య చికిత్సలు చేయించుకుంటున్న థరూర్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపినట్టు బుధవారం మీడియాలో వార్తలొచ్చాయి.