బీజేపీకి షాక్: కేంద్రానికి వ్యతిరేకంగా యశ్వంత్కు శత్రుఘ్న మద్దతు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మంగళవారం రాష్ట్ర మంచ్ అనే రాజకీయ వేదికను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే లక్ష్యంగా ఈ వేదికను కొనసాగిస్తున్నారు యశ్వంత్.
అయితే, ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా శతృఘ్న సిన్హా మాట్లాడుతూ.. తన అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు తగిన వేదికను తన పార్టీ (బీజేపీ) తనకు కల్పించలేదని, అందుకే ఈ వేదికలో చేరుతున్నానని చెప్పారు. తాను దేశ ప్రయోజనాల కోసం దీనిలో చేరానని, తన నిర్ణయాన్ని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించరాదని తెలిపారు.

యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్ళ స్థాయికి దిగజార్చిందన్నారు. ఈ ప్రభుత్వం స్వీయ ప్రయోజనాలకు తగినట్లుగా గణాంకాలను ప్రదర్శిస్తోందన్నారు. తాను ఏర్పాటు చేసిన రాష్ట్ర మంచ్ రాజకీయ పార్టీలకు అతీతమైన రాజకీయ వేదిక అని వివరించారు. ఇది జాతీయ ఉద్యమమని తెలిపారు. బీజేపీలో ఉన్నవాళ్ళంతా భయం భయంగా బతుకుతున్నారని, తాము అలా కాదని పేర్కొన్నారు.
శత్రుఘ్న సిన్హాతోపాటు టీఎంసీ ఎంపీ దినేశ్ త్రివేది, కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి, ఎన్సీపీ ఎంపీ మజీద్ మెమన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి సురేశ్ మెహతా, జేడీయూ నేత పవన్ వర్మ, ఆర్జేడీ నేత జయంత్ చౌదరి, మాజీ కేంద్ర మంత్రులు సోమ్ పాల్, హర్ మోహన్ ధావన్ హాజరయ్యారు.












Click it and Unblock the Notifications