రియల్ స్టోరీ: సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది
చెన్నై: మన దేశంలో మానవత్వం ఇంకా మిగిలుంది అనడానికి ఈ తల్లీ కూతుళ్ల ఉదంతమే నిదర్శనం. అనుకొని పరిణామాలతో ఇబ్బందుల్లో పడ్డ తల్లీ కూతుళ్లను ఆదుకొని, ఒక విద్యార్ధిని భవిష్యత్తుకు చిగురించేలా చెన్నైలోని టీ వాకర్లు నిజంగా దేవుళ్లే దిగివచ్చారన్న చందంగా సాయం చేసిన వైనం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన స్వాతి అనే అమ్మాయికి టీఎన్ఏయూ (తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్శిటీ) కౌన్సిలింగ్కు రమ్మని లేఖ అందింది. ఆ లేఖలో 'కౌన్సిలింగ్ వేదిక: అన్నా ఆరంగం' అని మాత్రమే ఉంది.
దాంతో, లేఖలో పేర్కొన్న తేదీన తన తల్లితో కలిసి స్వాతి చెన్నైలోని అన్నా యూనివర్శిటీకి చేరుకుంది. తీరా అక్కడికి వచ్చాక యూనివర్సిటీ అధికారులు కౌన్సిలింగ్ ఇక్కడ కాదు, కోయంబత్తూరులో అని చెప్పడంతో పెద్ద తప్పు జరిగిందని తెలుకున్న స్వాతి ఇక, తన కలలు కల్లలైపోయాయని ఎంతో వేదనతో తల్లితో కలిసి వర్శిటీ గేటు వద్ద తీవ్రంగా రోదిస్తున్నారు.
ఉదయం 8.30 గంటలు కావడంతో యూనివర్సిటీలో మార్నింగ్ వాక్ చేస్తున్న వారు ఆమె వద్దకు వచ్చి విషయం ఏంటని ఆరా తీశారు. అంతా విని, ఆ యువతికి ఎలాగైనా సాయపడాలని నిశ్చయించుకున్న వాకర్స్ అప్పటికప్పుడు తలా కొంత మొత్తం వేసుకుని రూ. 10,500లను పోగుచేశారు.
కౌన్సిలింగ్ సమయం సమీపిస్తుండటంతో తల్లీ, కూతురిని 10.05 గంటలకు వారిని కోయంబత్తూర్ ఫ్లయిట్ ఎక్కించారు. జరిగిన మొత్తాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్కు ముందుగానే వెల్లడించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ఉరుకులు పరుగులు పెడుతూ కౌన్సిలింగ్ వేదిక వద్దకు చేరుకున్న స్వాతిని అధికారులు సానుభూతితో స్వాగతించారు.
కౌన్సిలింగ్లో స్వాతికి టీఎన్ఏయూలో బీఎస్సీ బయోటెక్నాలజీలో సీటు వచ్చింది. దాంతో, ఆమె తల్లి ఎంతో సంబరపడిపోయింది. జరిగిన ఉదంతాన్ని వాకర్స్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఇది ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ తమ జీవితంలో జరిగిన ఓ అద్భుతంగా దీనిని పేర్కొంది. స్వాతి తల్లి తంగ పొన్ను కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.