నన్ను భయ్యా అని పిలుస్తుంది: అక్రమ సంబంధం ఆరోపణలపై కుమార్ విశ్వాస్
న్యూఢిల్లీ: పార్టీ వాలంటీర్తో వివాహేతర సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత కుమార్ విశ్వాస్ తీవ్రంగా స్పందించారు. తన రాజకీయ ప్రత్యర్థులు తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను దెబ్బ తీయడానికే ఆ ప్రయత్నం చేస్తున్నారని, వారితో తాను పోరాటం చేస్తానని ఆయన అన్నారు. తాము భయపడడం లేదని ఆయన అన్నారు.
తనను భయ్యా అని సంబోధిస్తూ ఆ మహిళ తనకు మెయిల్ పెట్టిందని, తాను దానిపై ఫిర్యాదు చేశానని, అంతకన్నా ఏం చేయగలనని ఆయన అన్నారు. కుమార్ విశ్వాస్కు మద్దతుగా పార్టీ నిలబడింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చినప్పుడు కూడా పార్టీ ఆయనను సమర్థించింది. కుమార్ విశ్వాస్పై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, తప్పుడు ఆరోపణలని పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ అన్నారు.
కుమార్ విశ్వాస్కు ఢిల్లీ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. విశ్వాస్కు తనతో వివాహేతర సంబంధం ఉందనే ఊహాగానాల పైన పెదవి విప్పడం లేదని ఏఏపీలోని ఓ మహిళా కార్యకర్త ఆరోపించినట్లుగా తెలుస్తోంది. తాను ఫిర్యాదు చేసినా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదని ధ్వజమెత్తారని సమాచారం. ఈ తరహా ఆరోపణలు పెరగడంతో తన భర్త వదిలేసి వెళ్లిపోయారని విమర్శించారని, ఈ ఆరోపణలను విశ్వాస్ కనీసం ఖండించకపోవడం సరికాదని ఆమె చెప్పారని తెలుస్తోంది.
ఆ యువతి పోలీసు కమిషనర్కు లేఖ రాసిందని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ చెప్పారు. అందువల్లే కుమార్ విశ్వాస్, ఆయన భార్యకు నోటీసులు పంపామని, మంగళవారం విచారణకు కమిషన్ ఎదుట హాజరై, వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాగా, పార్టీ వాలంటీర్తో కుమార్ విశ్వాస్కు సంబంధముందని, 2014 ఎన్నికల సమయంలో ఇరువురు కలిసి ఉన్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.