కేరళ గవర్నర్గా కేజ్రీ చేతిలో ఓడిన షీలా, ఎఎపి ఆగ్రహం
న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ కేరళ గవర్నర్గా నియమితులయ్యారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేని కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని ఆమెకు వెల్లడించారు. మూడుసార్లు ఢిల్లీ సిఎంగా పని చేసిన 75 ఏళ్ల షీలా దీక్షిత్ మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఆమె ఓడిపోయారు. దీంతో షీలాకు గవర్నర్ పగ్గాలు అప్పగించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నిఖిల్ కుమార్ ప్రస్తుతం కేరళ గవర్నర్గా ఉన్నారు.
ఆయన రాజీనామా చేసి బీహార్ నుంచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారు. దీంతో నిఖిల్ స్థానంలో కొత్త గవర్నర్గా షీలా దీక్షిత్ బాధ్యతలు చేపట్టడానికి వీలుగా మంగళవారం ఆమె నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి.
షీలా దీక్షిత్ 1998 నుండి 2013 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మాత్రం కేజ్రీవాల్ చేతిలో ఇరవై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. షీలా 1984 నుండి 1989 వరకు ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఉన్నారు.
మండిపడ్డ ఎఎపి
షీలా దీక్షిత్ను గవర్నర్గా ప్రమోట్ చేయడంపై ఎఎపి అగ్గిమీద గుగ్గలమయ్యింది. ఎఎపి నేత మనీష్ సిసోడియా ఢిల్లీలో మాట్లాడుతూ కుంభకోణాల విచారణ నుంచి రక్షించేందుకే షీలా దీక్షిత్ ను కేరళ గవర్నర్గా నియమించారని ఆరోపించారు. కామన్ వెల్త్ క్రీడల్లో నిధుల దుర్వినియోగం, కళాశాలల నియామకాల్లో అక్రమాలు తదితర అంశాల్లో షీలా దీక్షిత్ ఆరోపణలు ఎదుర్కొటున్నారని, విచారణ ప్రారంభమయ్యే దశలో ఆమెను గవర్నర్ గా నియమించడం కేవలం ఆమెను రక్షించేందుకేనని మండిపడ్డారు. నేటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రానున్నందున నిన్న హడావుడిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.