Sharad Pawar: ఆరు నెలల్లో మధ్యంతర ఎన్నికలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శరద్ పవార్..
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆరునెలల్లో కొత్త ప్రభుత్వం పడిపోయి, మధ్యంతర ఎన్నికలు రావొచ్చంటూ చెప్పారు. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత, NCP, కాంగ్రెస్, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం కుప్పకూలింది. బీజేపీ సాయంతో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. వచ్చే ఆరు నెలల్లో ఏక్నాథ్ షిండే-బీజేపీ కూటమి పతనం కానున్నందుని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉందని శరద్ పవార్ అన్నారు.
ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వంతో షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. ఒకసారి మంత్రిత్వ శాఖలు కేటాయించిన తర్వాత.. వారి అసంతృప్తి బయటపడుతుందని పవార్ చెప్పారు. అది చివరకు ప్రభుత్వం కూలే దశకు చేరుకుంటుందని అంచనా వేశారు. తమ చేతిలో ఆరు నెలలు ఉన్నాయనుకుని ఎన్సీపీ శాసనసభ్యులు తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కువ సమయం గడపాలని ఆయన సూచించారు.

జూన్ 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయగా, సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీగా ప్రమాణం చేశారు. షిండే నేతృత్వంలోని దాదాపు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సోమవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు.విశ్వాస పరీక్షలో షిండేకు మద్దతుగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.












Click it and Unblock the Notifications