ఢిల్లీకి చేరిన "మహా" పంచాయతీ: అమిత్ షాను కలవనున్న ఫడ్నవీస్..సోనియాతో పవార్ భేటీ
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నప్పటికీ అక్కడ బీజేపీ శివసేనల మధ్య ప్రతిష్టంభనకు ఇంకా తెరపడలేదు. రెండు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. దీనికితోడు ఎన్సీపీ అధినేత పవార్ ఎంట్రీ బీజేపీకి కాస్త తలనొప్పిగా మారింది. దీంతో మహారాష్ట్ర పంచాయతీ ఢిల్లీకి చేరింది.

పట్టువీడని శివసేన
మహారాష్ట్రలో రాజకీయాలు మలుపులు మీద మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీతో పొత్తుతో కలిసి పోటీ చేసిన శివసేన ఎన్నికల ముగిశాక పదవుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను అమలు చేయాలని గట్టిగా పట్టుబడుతోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి పదవిపై కూడా క్లారిటీ ఇచ్చాకే ప్రభుత్వం ఏర్పాటుకు వెళ్లాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే ఇతర పార్టీలతో కలిసి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే బెదిరింపులకు సైతం శివసేన దిగింది. ఈ క్రమంలోనే తమకు అండగా ఉంటానంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆపన్న హస్తం అందివ్వడంతో మహా పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరింది.

ఢిల్లీకి చేరిన పంచాయతీ
ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఎన్సీపీ చీఫ్ శరద్పవార్లు సోమవారం రోజున ఢిల్లీకి వెళుతున్నారు. శరద్ పవార్ భవిష్యత్ ప్రణాళికపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చించేందుకు వెళుతుండగా, ఫడ్నవీస్ శరద్ పవార్కు చెక్ పెట్టాలంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి కోరనున్నారు. బయటకు మాత్రం రైతు సమస్యలపై కేంద్రహోంమంత్రి అమిత్ షాను ఫడ్నవీస్ కలుస్తారని చెబుతున్నప్పటికీ... ఆయన ప్రధాన అజెండా మాత్రం శరద్ పవార్ గురించే అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి: శివసేన
గత పది రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా చోటుచేసుకుంటోంది. ఇప్పటి వరకు రెండు పార్టీలవారు తగ్గకపోవడంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఇద్దరు బెదిరింపు ధోరణితోనే వ్యవహరిస్తున్నప్పటికీ ఎవరూ ముందడుగు వేయకపోవడం విశేషం. సీఎం పదవి రెండు పార్టీలు కలిసి పంచుకుంటామని బీజేపీ లిఖితపూర్వకంగా ఇస్తేనే తాము మద్దతు ఇస్తామని లేదంటే తమ దారులు తమకు ఉన్నాయంటూ శివసేన పట్టబట్టి కూర్చుంది. అయితే బీజేపీ మాత్రం సీఎం పదవిపై తాము ఎప్పుడూ హామీ ఇవ్వలేదని చెబుతోంది. ఇక ఆదివారం శరద్ పవార్ను శివసేన పార్టీ నేతలు కలవడంతో బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లయ్యింది.

పార్టీ నేతలతో శరద్ పవార్ రహస్య భేటీ
ఇదిలా ఉంటే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తనకు ఓ మెసేజ్ పంపారని దాన్ని చూపించారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. అందులో తనకు శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఉందని అయితే దానర్థం వేరని చెప్పారు అజిత్ పవార్. సంజయ్ రౌత్కు ఫోన్ చేయాలనేది ఆ మెసేజ్ సారాంశమని చెప్పిన అజిత్ పవార్... సంజయ్ రౌత్కు ఫోన్ చేసి చెక్ చేస్తానని వెల్లడించారు. శివసేన బీజేపీల మధ్య జరుగుతున్న వార్ను చాలా దగ్గరగ సమీక్షిస్తున్న శరద్ పవార్ పార్టీ మాత్రం తాము విపక్షంలోనే కూర్చుంటామని చెబుతున్నప్పటికీ... ఆదివారం పలువురు సీనియర్ నేతలతో శరద్ పవార్ భేటీ అయి శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయమై చర్చించినట్లు సమాచారం.

ఒక్కింత సంశయం వ్యక్తం చేస్తున్న సోనియా గాంధీ
ఒక వేళ నిజంగానే శివసేన - ఎన్సీపీలు ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తే కాంగ్రెస్ బయటనుంచి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్లో 44 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఈ రెండు పార్టీలకు మద్దతు ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నారు. అయితే సోనియాగాంధీ మాత్రం ఒక్కింత సంకోచిస్తున్నట్లు సమాచారం. శివసేనకు మద్దుత ఇస్తే కాంగ్రెస్ పార్టీ లౌకికత్వం ప్రశ్నార్థకంగా మారుతుందేమోననే చిన్నపాటి సందేహంను ఆమె వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications