నితీష్ రాజకీయ హీరో, మోడీ బాధ్యత: శివసేన చురక
పాట్నా: బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శివసేన.. జెడియూ అధినేత నితీష్ కుమార్ పైన ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని చెప్పింది. మహారాష్ట్రలో బిజెపి, శివసేన మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శివసేన... మిత్రపక్షం బిజెపి పైన ఘాటు విమర్శలు చేసింది. నితీష్ కుమార్ను హీరోగా అభివర్ణించింది. నితీశ్ గొప్ప విజయాన్ని సాధించారని, ఈ విజయంతో నితీశ్ పొలిటికల్ హీరోగా ఆవిర్భవించారని ప్రకటించింది. బీహార్లో ఓటమికి మోడీ బాధ్యత వహించాలన్నారు.
శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఇది నితీష్ కుమార్కు మంచి గెలుపు అని, అతను పొలిటికల్ హీరోగా నిలిచారని కితాబిచ్చారు. కాంగ్రెస్ ఓటమి చెందినప్పుడు సోనియా గాంధీ బాధ్యత తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు మోడీ బాధ్యత తీసుకోవాలన్నారు.
బీహార్ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడయింది. బనియాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ అభ్యర్థి కేదార్ నాథ్ సింగ్ విజయం సాధించారు. తమ కూటమి తరఫున నితీష్ కుమారే ముఖ్యమంత్రి అని లాలూ ప్రసాద్ సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి చెప్పారు.