తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమే: శివసేన, సిఎంపై ఫైర్
ముంబై: విదర్భ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలను శివసేన తప్పుబట్టింది. ప్రత్యేక రాష్ట్ర హోదాపై మాట్లాడటానికి బదులు ఆ ప్రాంత అభివృద్ధిపై అధికార బీజేపీ దృష్టి సారిస్తే మంచిదని ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో సూచించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విదర్భలో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు సాధించిందని, అయితే మహారాష్ట్ర విభజన కోసమే అక్కడి ప్రజలు బిజెపికి ఓటేశారని ఆ పార్టీ భావించరాదని శివసేన పేర్కొంది.
సోమవారం నాగ్పూర్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ది ప్రెస్లో బిజెపి చిన్న రాష్ర్టాలకు అనుకూలమని ఫడ్నవిస్ చెప్పారు.

తెలంగాణ మాదిరిగా కాకుండా సామరస్యపూర్వక పరిష్కారం కనుగొంటామని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా ప్రతిస్పందించింది. మహారాష్ట్ర నుంచి విదర్భను విడదీయడం తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని వ్యాఖ్యానించింది. విదర్భ నుంచి ఎన్నికైన నేత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత విభజన గురించి మాట్లాడటం.. మహారాష్ట్ర పరిరక్షకుడిగా వచ్చి ద్రోహిగా మారడమే అని శివసేన వ్యాఖ్యానించింది.
గౌరవం ఇవ్వకపోతే ప్రతిపక్ష పాత్రే: శివసేన ఎంపి
నవంబర్ 12న అసెంబ్లీలో బలనిరూపణ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అప్పటి వరకు శివసేన ప్రజాప్రతినిధులను మంత్రివర్గంలోకి తీసుకోబోమని సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం స్పష్టం చేశారు. మంత్రి మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బలనిరూపణ సమయంలో శివసేన బిజెపికి మద్దతిచ్చి, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటయ్యాకే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేనకు ప్రాతినిథ్యంపై సిఎం ఫడ్నివిస్ వ్యాఖ్యలపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను గౌరవప్రద రీతిలో కలుపుకొని పోవాలని బిజెపి భావించడం లేదని శివసేన ఎంపి ఒకరు వ్యాఖ్యానించారు. శనివారంలోగా బిజెపి గౌరవప్రద పరిష్కరాన్ని చూపించకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications