శివసేన బీజేపీ సీట్ల పంపకాలు: అలా కాకుంటే మాదారి మేము చూసుకుంటామన్న శివసేన
ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే అధికార బీజేపీతో పలు పార్టీలు పొత్తుల కోసం పాకులాడుతున్నాయి. ఇక ప్రధాన పార్టీ మిత్రపక్షంగా ఉన్న శివసేన బీజేపీతో చర్చలు ప్రారంభించింది. సీటు పంపకాలపై ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే చర్చలు ఇప్పటికే ప్రారంభించారు. అయితే అవి ఓ కొలిక్కి రాలేదని సమాచారం. బీజేపీ ఎక్కువ సీట్లలో పోటీచేయాలని పట్టుబడుతోంది.

సగం సీట్లు కావాలని పట్టుబడుతోన్న శివసేన
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి. ఇందులో అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని అధికార బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం శివసేన బీజేపీల మధ్య సీట్ల పంపకాల విషయమై చర్చలు జరుగుతున్నాయి. చర్చలు విఫలమైతే శివసేన ఇప్పటికే సిద్ధం చేసుకున్న రెండో ప్లాన్ను అమలు చేసేందుకు సిద్ధపడింది. ఈ మేరకు ఆదివారం ఉద్దవ్ థాక్రే నివాసంలో పలువురు ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఒకవేళ చర్చలు విఫలమైతే ప్లాన్ బీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.

ప్లాన్ బీ చర్చలు విఫలమైతే ప్లాన్ బీ అమలు చేస్తాం
ప్లాన్ బీలో భాగంగా శివసేన ఒంటరిగా అన్ని సీట్లు అంటే 288 సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులను కూడా ఖరారు చేసే పనిలో పడినట్లు శివసేన నాయకుడు ఒకరు చెప్పారు. చర్చల్లో భాగంగా ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని తమ నాయకుడు నేతలకు, క్యాడర్కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. 2014లో తాము ముందుగా సిద్ధంగా లేమని చెప్పిన నేత... ఈసారి మాత్రం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నామని వెల్లడించారు. ఇక బీజేపీ శివసేనలు చెరోసగం సీట్లలో పోటీచేయాలని ఆ విధంగా సీట్లపంపకాలు ఉండాలని చెప్పారు. ఇందుకు బీజేపీ ససేమిరా అంటోంది. వెంటనే ముఖ్యమంత్రి శివసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో ముందుగా చెప్పాలని ఆ పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే డిమాండ్ చేశారు.

నాడు 50:50 సీట్లలో పోటీ చేస్తామన్న హామీ మరవరాదు
ఇదిలా ఉంటే ఇప్పటికే రెండో ఛాయిస్గా తమ అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని శివసేన నేత చెప్పారు. పొత్తుల గురించి సెప్టెంబర్ 19న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో నాసిక్లో ప్రకటిస్తామని బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాద్ తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరిలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో చెరో సగం సీట్లలో పోటీచేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని శివసేన యువనేత ఆదిత్య థాక్రే చెప్పారు. శివసేన ఇప్పటి వరకు ఎవరినీ మోసం చేసింది లేదని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications