సొంత కంపెనీకే షాక్ : 'రింగింగ్ బెల్స్' నుంచి మొహిత్ బయటికి
రూ.251కే స్మార్ట్ ఫోన్ ప్రకటనతో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన 'రింగింగ్ బెల్స్' సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన మొహిత్ గోయల్ ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చేశారు.
నోయిడా: రింగింగ్ బెల్స్.. గుర్తుందా? అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అంటూ దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న సంస్థ. ఒక్క ప్రకటనతో దిగ్గజ మొబైల్ కంపెనీలకు ముచ్చెమటలు పోయించిందీ సంస్థ. ప్రజలు కూడా ఆ సమయంలో ఈ ఫోన్ బుక్ చేసుకోవడానికి ఎగబడ్డారు కూడా.
రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటూ ఈ సంస్థ దేశాన్ని ఒక ఊపు ఊపేసిన తర్వాత బోలెడన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసలు ఆ ధరకు మొబైల్ ఫోన్ అమ్మకం ఎలా సాధ్యమంటూ కొన్ని కంపెనీలు సందేహాలు కూడా లేవనెత్తాయి.
దీంతో ప్రభుత్వ పెద్దలకు ఈ కంపెనీ ప్రకటనపై అనుమానాలు తలెత్తడం, ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగి సోదాలు జరపడం.. ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. చివరికి తాను ముందు ప్రకటించిన విధంగా రింగింగ్ బెల్స్ కంపెనీ రూ.251కే 'ఫ్రీడం' స్మార్ట్ ఫోన్లను పంపిణీ కూడా చేసింది.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు అకస్మాత్తుగా ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన మొహిత్ గోయల్ కంపెనీ నుంచి బయటికి వచ్చేశారు. సంస్థకు మరో డైరెక్టర్ గా ఉన్న ఆయన భార్య దార్న కూడా తన పదవికి రాజీనామా చేశారు.
దీంతో మొహిత్ గోయల్ సోదరుడు అన్ మోల్ ప్రస్తుతం రింగింగ్ బెల్స్ సంస్థకు ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు రింగింగ్ బెల్స్ నుంచి బయటికి వచ్చిన మొహిత్ గోయల్ ఎండీఎం ఎలక్ట్రానిక్స్ పేరుతో మరో కంపెనీని ప్రారంభించారు. అయితే రింగింగ్ బెల్స్ నుంచి నిష్క్రమణకు దారితీసిన పరిణామాలు, పరిస్థితులపై మాట్లాడేందుకు మొహిత్ గాని, ఆయన భార్య ధార్నగాని ఎలాంటి ప్రయత్నం చేయలేదు.