సిద్ధరామయ్యకు మరో చిక్కు: మహిళ ప్రాణం తీసిన సీఎం కాన్వాయ్
బెంగళూరు: ఇటీవలి కాలంలో తరచూ వివాదాలతో తలగోక్కుంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్ వెళ్లడం కోసం.. అంబులెన్స్ను సైతం అడ్డుకోవడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. జూన్ 25న బెంగళూరులోని హోస్కొటే సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గామారింది. దీంతో సీఎంపై నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్ వెళ్లడం కోసం.. చిక్కబల్లాపూర్-చింతామణి హైవేపై ట్రాఫిక్ను దాదాపు 25 నిమిషాల పాటు నిలిపివేశారు. ఈ ట్రాఫిక్లో ఓ అంబులెన్స్ కూడా ఉంది. తన తల్లి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందని.. అంబులెన్స్కు దారి ఇవ్వాలని ఓ వ్యక్తి పోలీసులను కోరాడు.
మిగతా వాహనదారులు కూడా అంబులెన్స్ను వెళ్లనివ్వాలన్నారు. అయితే పోలీసులు మాత్రం వారి మాటలను పట్టించుకోకుండా.. కాన్వాయ్ వెళ్లిన తర్వాతే ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో అంబులెన్స్ ఆసుపత్రికి చేరేసరికి ఆలస్యమైపోయింది.. అప్పటికే అందులోని మహిళ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటననంతా ఓ వ్యక్తి వీడియోతో పాటు.. ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను అడ్డుకున్న మాట నిజమే గానీ.. కేవలం 2-3 నిమిషాలే ట్రాఫిక్ను నిలిపివేశామన్నారు.
అంతేగాక, అంబులెన్స్లో మహిళా రోగి ఎవరూ లేరని అన్నారు. అందులో ఓ ప్రమాదంలో గాయపడిన నవీన్ అనే పేషెంట్ మాత్రమే ఉన్నారని, ఆయనతోపాటు అతని భార్య లక్ష్మి ఉందని చెప్పారు. అప్పటికి అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు. నిరాధారమైన వార్తలు ప్రచురితం చేయవద్దని ఐజి ఆఫ్ పోలీస్(సెంట్రల్ రేంజీ) సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. వీడియో వైరల్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టామని చెప్పారు.