విచారణకు సిట్: సునందను శశిథరూర్ హర్ట్ చేయలేదు.. పుష్కర్ ఫ్రెండ్స్ సపోర్ట్
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసును విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను (సిట్) నియమించామని ఢిల్లీ పోలీసు చీఫ్ బీఎస్ బస్సీ బుధవారం నాడు చెప్పారు. డీసీపీ, ఏసీపీలు సిట్ను పర్యవేక్షిస్తారని చెప్పారు.
సునంద మృతి కేసులో శశిథరూర్ను మరోసారి ప్రశ్నించవలసిన సందర్భం ఏర్పడితే విచారిస్తామని చెప్పారు. ఏం చేసినా తాము మీడియాకు చెబుతామన్నారు. మరిన్ని విషయాలు తెలిసినప్పుడు తప్పకుండా మీడియా ముందుకు తీసుకు వస్తామన్నారు. విచారణలో భాగంగా ప్రతి దానిని తాము పరిగణలోకి తీసుకుంటామన్నారు. కాగా, సునంద పుష్కర్ కేసు విచారణ అధికారులకు ఓ టఫ్ టాస్క్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.
శశిథరూర్కు సునంద పుష్కర్ స్నేహితుల మద్దతు
శశిథరూర్కు సునంద పుష్కర్ స్నేహితులు మద్దతుగా నిలుస్తున్నారు. సునంద మృతి హత్య వల్ల జరిగింది కాకపోవచ్చునని వారు అభిప్రాయపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సునంద మృతి, తదితర పరిణామాలు తమను షాక్కు గురి చేస్తున్నాయని చెప్పారని అంటున్నారు.
ఇది హత్య కాకపోయి ఉండవచ్చునని, శశిథరూర్ను ఇరికించేందుకు ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉండవచ్చునని, వారిద్దరు తమకు వేర్వేరుగా ఉన్నప్పుడు, ఒక్కటైన తర్వాత కూడా తెలుసునని, శశిథరూర్ ఎప్పుడు కూడా సునందను హర్ట్ చేయలేదని, కాబట్టి హత్య కోణం కాకపోయి ఉండవచ్చునని చెబుతున్నారంటున్నారు.
శశిథరూర్ చురుకైన రాజకీయ నాయకుడు అని, కానీ అతను భారత రాజకీయాలకు సరిపోరని తాను భావిస్తున్నానని సునంద ఓ స్నేహితుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. 2005 నుండి సునందకు పరిచయమున్న మరో స్నేహితుడు మాట్లాడుతూ... విచారణ తీరు తనను నిరాశకు గురి చేసిందని చెప్పారని సమాచారం.