తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మరణం!
Road Accident: హరిద్వార్ గంగా నదిలో అస్తికలు కలిపేందుకు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం తమ మారుతి ఎర్టిగా (Ertiga) కారులో హరిద్వార్కు బయలుదేరింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో పానిపట్-ఖతిమా హైవేపై తిఠావి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు వీరి కారును బలంగా ఢీకొట్టింది. ట్రక్కు వేగం ఎంత ఎక్కువగా ఉందంటే కారులో ఉన్న వారికి తప్పించుకునే అవకాశం కూడా లభించలేదు. ఢీకొన్న ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కాగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

సహాయక చర్యలు.. ప్రభుత్వ స్పందన
ట్రక్కు ఢీకొట్టిన శబ్దం విని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ పనులు ప్రారంభించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సహాయంతో కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీశారు. గాయపడిన వ్యక్తిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
మృతులంతా కర్నాల్ జిల్లాలోని ఫరీద్పూర్ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. తమ కుటుంబ సభ్యుడి అస్తికలు నిమజ్జనం చేసేందుకు వెళ్తూ ఇలా ప్రమాదానికి గురి కావడంతో కర్నాల్లోని వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. అయితే డ్రైవర్, క్లీనర్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సాధ్యమైనంత సహాయం అందించాలని అధికారులును ఆదేశించారు.












Click it and Unblock the Notifications