జార్ఖండ్లో భారీ పేలుళ్లు: 9మంది మృతి, 25మందికి గాయాలు..
25మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
జంషెడ్పూర్: జార్ఖండ్ తూర్పు సింగ్బమ్ జిల్లాలోని కుమార్దూబి గ్రామంలో ఉన్న ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. 9మంది దుర్మరణం చెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
ఆదివారం రాత్రి ఈ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. మృతులకు ప్రభుత్వం రూ.2లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. వారంతపు మార్కెట్ కావడంతో ఆదివారం కుమార్దూబి ప్రాంతం రద్దీతో కనిపించింది. దీనికి సమీపంలోనే పేలుళ్లు సంభవించడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మంటలు ఇంకా ఎగసిపడుతుండగా.. ఫైరింజన్లు నిరంతరాయంగా మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. బాణసంచా ఫ్యాక్టరీని ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్యాక్టరీలో భారీ మొత్తంలో క్రాకర్స్ నిలువ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.