హైటెక్ క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్: 19 లక్షల నగదు సీజ్
బెంగళూరు: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల సందర్బంగా బెంగళూరు నగరంలో హైటెక్ క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలు వెలిశాయి. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని బెంగళూరు క్రైం బ్రాంచ్ ( సీసీబీ ) పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన బెట్టింగ్ రాయుళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గజేంద్ర, హిమాంషు, సతీష్, రాకేష్ ప్రకాష్, ప్రవీణ్, గిరీష్ అనే నిందితులను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. నిందితుల నుండి 19 లక్షల రూపాయల నగదు, రూ. 45 లక్షల విలువైన 26 మొబైల్ ఫోన్ లు, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాదీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.
బెంగళూరు నగరంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల సందర్బంగా భారీగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నదని పోలీసులకు సమాచారం అందింది. సర్జాపుర రింగ్ రోడ్డులోని టీచర్స్ కాలనీలోని ఎస్ ఐ అపార్ట్ మెంట్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గజేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.
జేపీ నగరలోని ఆర్ ఎఫ్ ఫిట్ నెస్ జిమ్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. నందిని లేఔట్ లోని సరస్వతి పురంలోని ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేశారు. ఈ మూడు ప్రాంతాలలో మకాం వేసిన నిందితులు వివిధ ప్రాంతాలలో ఉన్న వారిని మొబైల్ లలో సంప్రదించి బంతి బంతికీ, ప్రతి ఓవర్ కు, విక్కెట్ కు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సీసీబీ పోలీసులు తెలిపారు.