షాకింగ్ : సంతానం కలగాలని.. బాలికను చంపి... చిన్నారి ఊపిరితిత్తులతో క్షుద్రపూజలు...
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఆరేళ్ల ఓ బాలికపై కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారు. సంఘటనా స్థలంలో చిన్నారి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు... ఆమె శరీరం నుంచి ఊపిరితిత్తులను తొలగించడాన్ని గుర్తించి షాక్ తిన్నారు. క్షుద్రపూజల కోసమే బాలిక శరీరం నుంచి ఊపిరితిత్తులు తీసినట్లు గుర్తించారు. ఆదివారం(నవంబర్ 15) వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు సోమవారం(నవంబర్ 16) మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో వెలుగుచూసిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవగా... ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో మహిళలపై అఘాయిత్యాలకు తెరపడట్లేదు.

ఆరోజు ఏం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పరిధిలో ఉన్న ఘటంపూర్కి చెందిన ఓ బాలిక(6) దీపావళి పండుగ రోజు (నవంబర్ 14) రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. బాణసంచా కొనుగోలు కోసమని బయటకెళ్లిన బాలిక.. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. అదే గ్రామానికి చెందిన అంకుల్,బీరన్ అనే వ్యక్తులు ఆరోజు రాత్రి బాలికను కిడ్నాప్ చేశారు. అప్పటికే ఆ ఇద్దరు పూర్తి మద్యం మత్తులో ఉన్నారు.

కిడ్నాప్కు గురైన బాలిక...
ఘటంపూర్కి చెందిన పరుశురాం అనే వ్యక్తికి 1999లో వివాహమైంది. కానీ సంతానం కలగలేదు. క్షుద్ర పూజలు చేస్తే సంతానం కలుగుతారని ఎవరో చెప్పడంతో.. ఆ విషయాన్ని బలంగా నమ్మాడు. ఇందుకోసం ఎవరైనా బాలికను హత్య చేసి... మృతురాలి ఊపిరితిత్తులతో క్షుద్ర పూజలు చేయాలనుకున్నాడు. ఇదే విషయాన్ని అంకుల్(20),బీరన్(31)లకు చెప్పడంతో దీపావళి రోజు రాత్రి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

అత్యాచారం.. హత్య...
కిడ్నాప్ అనంతరం చిన్నారిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత చిన్నారిని కిరాతకంగా హత్య చేసి... ఆమె శరీరం నుంచి ఊపిరితిత్తులు తొలగించారు. అనంతరం వాటిని పరశురాంకు అప్పగించారు. అప్పటికే చిన్నారి కోసం ఆమె కుటుంబం తీవ్రంగా గాలిస్తున్ననప్పటికీ.. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో స్థానిక పోలీసులను ఆశ్రయించగా... మిస్సింగ్ కేసు నమోదైంది.
Recommended Video

నేరం అంగీకరించిన నిందితుడు...
దర్యాప్తు నిమిత్తం రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం(నవంబర్ 16) పరుశురాం,అతని భార్యను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట ఇద్దరూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ... ఆ తర్వాత అసలు నిజం ఒప్పుకున్నారు. బాలిక ఊపిరితిత్తులతో క్షుద్రపూజలు చేస్తే సంతానం కలుగుతుందన్న ఉద్దేశంతో తానే ఆ చిన్నారిని కిడ్నాప్ చేయించినట్లు పరశురాం అంగీకరించాడు. ఇందుకోసం అంకుల్,బీరన్ల నుంచి సహాయం తీసుకున్నట్లు చెప్పాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లడంతో... నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications