బందరు టెక్కీ హత్య: పోలీసుల అదుపులో వ్యక్తి?
ముంబై: మచిలీపట్నం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించినట్లే కనిపిస్తోంది. బందరుకు చెందిన అనూహ్య ముంబైలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఓ 40 ఏళ్ల వ్యక్తిని హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నట్లు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి.
సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని ముంబై తరలించి, ప్రశ్నించినట్లు సమాచారం. జనవరి 5వ తేదీన ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి అదృశ్యమైన అనూహ్య శవం కుళ్లిపోయిన దశలో జనవరి 16వ తేదీన కంజుర్మార్గ్లో కనిపించింది.
అనూహ్య లగేజీని పట్టుకుని తెల్ల రంగు చొక్కా, నీలం రంగు జీన్స్ ధరించిన వ్యక్తి ఆమెను అనుసరించినట్లు పోలీసులు సిసిటీవి ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. ఆ వ్యక్తితో పాటు అనూహ్య సెల్ఫోన్ను ఛేదించడానికి పనికి వస్తుందని భావిస్తున్నారు. ఆ వ్యక్తి అనూహ్యకు తెలిసినవాడిగా పోలీసులు భావిస్తున్నారు.
మహారాష్ట్రలోకి ప్రవేశించిన తర్వాత అనూహ్య ఎవరికీ ఫోన్ చేయలేదని పోలీసులు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. అయితే, అనూహ్య ఫోన్లో మాట్లాడుతూ నడుస్తుండగా, ఆ వ్యక్తి ఆమె లగేజీ తీసుకుని అనుసరించడం సిసిటీవి ఫుటేజీలో కనిపిస్తోంది. కుటుంబ సభ్యులకు తెలియకుండా అనూహ్యకు మరో ఫోన్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసిటివీ ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించడానికి పోలీసులు అనూహ్య కుటుంబ సభ్యులను కలిశారు.