మద్య నిషేధం కుదరదు.. తాగే హక్కు ప్రజలకు ఉంది.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
మద్య నిషేధానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ మంత్రి గోవింద్ సింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. మద్యపాన నిషేధం కుదరదని చెప్పిన ఆయన.. దాన్ని సమర్థించేందుకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమకు నచ్చిన తిండి తినేందుకు,తాగేందుకు హక్కు ఉంటుందని చెప్పారు. మద్యం తాగాలని ఎవరూ ఎవర్నీ బలవంతం చేయట్లేదని.. కావాల్సినవాళ్లు షాప్కి వెళ్లి స్వయంగా తెచ్చుకుంటున్నారని చెప్పారు. కాబట్టి మద్యంపై నిషేధం విధించడం కుదరదన్నారు.
అంతేకాదు, వైద్య చికిత్స తీసుకునేటప్పుడు కొంతమంది పేషెంట్లకు మద్యం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. తన మిత్రుడు ఒకరు ప్రతీ రోజూ రాత్రి ఒక పెగ్గు తీసుకుంటాడని, లేదంటే ఆరోజు రాత్రి అతనికి నిద్ర పట్టదని చెప్పారు. ఆ ఒక్క పెగ్గు వల్ల రాత్రిపూట మంచి నిద్ర పట్టడంతో పాటు ఉదయం కూడా యాక్టివ్గా ఉంటారని అన్నారు.కొంతమంది పేషెంట్లకు వైద్యులే సలహా ఇస్తుంటారని, తక్కువ మొత్తంలో రోజూ ఒక పెగ్గు తీసుకోవాలని చెబుతుంటారని గోవింద్ సింగ్ అన్నారు. వ్యక్తుల ఆహారపు అలవాట్లు,డ్రింకింగ్ అలవాట్లపై తామెలాంటి నిషేధాలు పెట్టదలుచుకోలేదని స్పష్టం చేశారు.
ఇటీవల కమలనాథ్ సర్కార్ మధ్యప్రదేశ్లోని లిక్కర్ కాంట్రాక్టర్లకు సబ్ షాప్స్ ఓపెన్ చేసుకునేందుకు అనుమతులిచ్చింది. దీంతో లిక్కర్ మాఫియాకు సీఎం న్యూ ఇయర్ కానుక ఇచ్చారంటూ మాజీ సీఎం,బీజేపీ నేత శివరాజ్సింగ్ చౌహాన్ విమర్శించారు. మధ్యప్రదేశ్ను మదిరప్రదేశ్(మద్య ప్రదేశ్)గా మారుస్తున్నారని మండిపడ్డారు. అయితే అక్రమ మద్యం విక్రయాలను అడ్డుకునేందుకు తాము సబ్ షాప్స్కు అనుమతిచ్చామని మంత్రి గోవింద్ సింగ్ చెబుతున్నారు. మద్య నిషేధంపై అంత ఆందోళన ఉంటే.. తన హయాంలో ఎందుకు ఆ పనిచేయలేదని ప్రశ్నించారు. కాగా,ప్రభుత్వం తాజా ఆదేశాల ప్రకారం ప్రస్తుతం వైన్ షాప్స్ నిర్వహిస్తున్న యజమానులు.. అదనపు ఫీజును చెల్లించి ఐదు కి.మీ దూరంలో మరో సబ్ షాప్ను ఓపెన్ చేసుకోవచ్చు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10కి.మీ దూరంలో ఏర్పాటు చేసుకోవచ్చు.