మందలించినందుకు కన్న తండ్రినే కిరాతకంగా చంపిన కొడుకు
ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నాయి అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. క్షణికావేశంలో కన్నవారిని సైతం కిరాతకంగా చంపుతుండడం సర్వత్రా సంచలనంగా మారుతోంది. ఇప్పటికే ఈ తరహా ఘటనలు ఎన్నో చోటు చేసుకోగా ఇప్పుడు ఇలాంటి ఘటనే మరొకటి సంచలనంగా మారింది.
దొంగతనం ఎందుకు చేశావ్? అని మైనర్ కుమారుడిని.. ప్రశ్నించడమే ఆ తండ్రి తప్పు అయ్యింది. మందలించింది తండ్రే కదా అని ఆ కొడుకు అనుకోలేదు. తండ్రి మీద కోపంతో ఇంట్లోని ఓ గదిలో నిద్రిస్తున్న తండ్రికి నిప్పు పెట్టాడు. తప్పించుకోకుండా గది తలుపులు వేసేశాడు. దీంతో ఆ తండ్రి గదిలోనే సజీవ దహనమయ్యాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ లో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫరీదాబాద్లోని ఓ ఇంట్లో అలాం అన్సారీ నివసిస్తున్నాడు. అతనికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గత మంగళవారం నాడు తన షర్టు జేబులోంచి కొడుకు డబ్బులు తీయడంతో అన్సారీ అతనిని మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న కుమారుడు అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో.. తండ్రి నిద్రిస్తుండగా నిప్పంటించి పరారయ్యాడు.
గదిలోంచి అరుపులు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూసేసరికే అతడు ప్రాణాలు విడిచాడు. తాము చూస్తుండగానే ఆ కుమారుడు ఇంటి గోడ దూకి పారిపోయాడని చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాలుడిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications