ఇంటికి అద్దె చెల్లించని సోనియా గాంధీ.. పార్టీ కార్యాలయంపై కూడా లక్షల్లో బకాయి : ఎన్నేండ్లకు నుంచి అంటే ?
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన అధికారిక నివాసానికి కొన్నాళ్లుగా కేంద్రాన్ని కిరాయి చెల్లించడంలేదు. అంతే కాదు పార్టీ కార్యాలయానికి కూడా కొన్ని సంవత్సరాలుగా అద్దె చెల్లించలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుతో సహా పలువురు ఆపార్టీ నేతలు కూడా కేంద్రానికి పెద్ద మొత్తంలో బకాయి పడ్డట్లు బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ట్విట్టర్ వెల్లడించారు.
గత ఏడాదిగా ఇంటి అద్దె చెల్లించని సోనియా
ఢిల్లీలోని 10 జన్పథ్ రోడ్డులో ఉన్న అధికార బంగ్లాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2020 సెప్టెంబర్లో చివరిసారిగా అద్దె చెల్లించారు. అప్పటి నుంచి కిరాయి చెల్లించాల్సి ఉంది. ఆమె నివాసానికి సంబంధించి రూ.4,610 అద్దె ఇవ్వాల్సి ఉంది. అంతే కాకుండా పార్టీ నేతలు కూడా అద్దె చెల్లించాల్సి ఉంది. సుజిత్ పటేల్ అనే సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేయగా.. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సమగ్ర వివరాలు ఇచ్చింది. ఈ ఆర్టీఐ కాపీని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా తన ట్విట్టర్లో షేర్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి లక్షల్లో అద్దె బకాయి..
అటు సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ విన్సెంట్ జార్జ్ ఢిల్లీలోని చాణక్యపురిలో కేంద్రం ప్రభుత్వ కేటాయించిన బంగ్లాలోనే ఉంటున్నారు. ఆయన గత 2013 ఆగస్టు నుంచి కిరాయి కట్టలేదు. ఆ బంగ్లాపై మొత్తం రూ.5,07,911 అద్దె కట్టాల్సి ఉందని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనానికి సంబంధించిన అద్దె కూడా భారీగానే పేరుకు పోయింది. 2012 డిసెంబర్ నుంచి కాంగ్రెస్ చెల్లించలేదు. ఇన్నేండ్లుగా మొత్తం రూ.12,69,902 చెల్లించాల్సి ఉందని కేంద్రం వెల్లడించింది

2013లోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఖాళీ చేయాల్సి ఉన్నా..
హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ నిబంధనల ప్రకారం జాతీయ, ప్రాంతీయ పార్టీ మూడేళ్ల పాటు తక్కువ కిరాయితో కూడిన భవనాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ లోపు ఆయా పార్టీలు వాటికి కేటాయించిన స్థలంలో సొంత కార్యాలయాలు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అనంతరం కేంద్రం ఇచ్చిన బిల్డింగ్లను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా తీసుకున్న భవనాలను ఆ గడువు దాటిపోయినా కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ మళ్లీ పొడిగించుకుంటూ వస్తోంది. అక్బర్ రోడ్డులోని కార్యాలయంతో పాటు, మరో రెండు బంగ్లాలను 2013లోనే కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయాల్సి ఉంది. కానీ, ఆ పార్టీ మాత్రం పలుమార్లు పొడిగింపు వెసులుబాటును ఉపయోగించుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయకపోగా.. అద్దె కూడా చెల్లించని స్థితిలో ఉందా అని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications