కర్తవ్యాన్ని బోధించిన సోనియా
Waqf Amendment Bill: దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును కేంద్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. 12 గంటల పాటు అంటే అర్ధరాత్రి 12 వరకూ దీనిపై చర్చ సాగింది. అనంతరం ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేశారు. 232 మంది దీన్ని వ్యతిరేకించారు.
నేడు రాజ్యసభ సమక్షానికి రానుందీ వక్ఫ్ బిల్లు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ భేటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ రాజ్యసభ, లోక్సభ సభ్యులు దీనికి హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దీనికి నేతృత్వాన్ని వహించారు.

ఈ సందర్భంగా సోనియా గాంధీ ప్రసంగించారు. పలు అంశాలను ప్రస్తావించారు. వివాదాస్పద పరిస్థితులు, ఉద్రిక్త పూరక వాతావరణం మధ్య లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు- 2024 ఆమోదం పొందిందని అన్నారు. లోక్సభ ప్రొసీడింగ్స్ను బుల్డోజ్ చేశారని ఆరోపించారు. 12 గంటల పాటు చర్చించినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.
నేడు వక్ఫ్ సవరణల బిల్లు రాజ్యసభ ముందుకు రాబోతోందని, ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ దీన్ని తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తాయో స్పష్టంగా వివరించాలని సభ్యులకు సూచించారు.
వక్ఫ్ బిల్లు విషయంలో తమ పార్టీ వైఖరి చాలా స్పష్టంగా ఉందని సోనియా గాంధీ తేల్చి చెప్పారు. దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తోన్నామని పునరుద్ఘాటించారు. ఈ బిల్లును రాజ్యాంగంపై దారుణమైన దాడిగా అభివర్నించారామె. దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications