రాహుల్తో కలిసి విదేశాలకు సోనియా గాంధీ... కారణమదే...
గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం శనివారం విదేశాలకు వెళ్లారు. సోనియా వెంట ఆమె కుమారుడు,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా విదేశాలకు వెళ్లారు.అయితే రాహుల్ వారం లోగా ఇండియా తిరిగి వచ్చి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా మాత్రం పార్లమెంట్ సమావేశాలకు కొద్ది రోజులు దూరం కానున్నారు.
పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాలేకపోతున్నప్పటికీ... ఇప్పటికే సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూపుతో సోనియా చర్చించారు. ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆర్థిక మందగమనం,కరోనా వైరస్ పరిస్థితులు తదితర అంశాలను సమావేశాల్లో లేవనెత్తాలని సూచించారు.
కాగా, జులై 30న సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల చికిత్స అనంతరం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రొటీన్ హెల్త్ చెకప్స్ కోసమే ఆమె ఆస్పత్రిలో చేరినట్లు గంగారాం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. డిశ్చార్జి సమయంలో ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే,శుక్రవారం (సెప్టెంబర్ 11) పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీని సోనియా గాంధీ పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. సోనియా సహా 22 మంది సభ్యులు,26 మంది శాశ్వత సభ్యులు,9 మంది ప్రత్యేక ఆహ్వానితులతో సీడబ్ల్యూసీ కమిటీ జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇటీవల పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించేలా అధిష్టానానికి లేఖలు రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్లలో పలువురికి షాకిచ్చిన సంగతి కూడా తెలిసిందే. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సహా అంబికా సోనీ,మోతీలాల్ ఓరా,మల్లిఖార్జున్ ఖర్గేలను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించారు.