విదేశాలకు గాంధీ కుటుంబం: అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్.. యుద్ధానికి సమాయాత్తమౌతోంది. దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను దీనికి ప్రధాన అస్త్రంగా చేసుకుంది. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఆహార వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం వల్ల సామాన్యులు పడుతోన్న ఇబ్బందులు, రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలను ప్రయోగిస్తోండటం వంటి అంశాల ఆధారంగా భారత్ జోడో యాత్రను మొదలు పెట్టనుంది.
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర మొదలు కాబోతోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ గాంధీ కాలినడకన ఈ యాత్రను పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్యాకుమారిలో ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. భారత్ జోడో యాత్రను విజయవంతం చేయడానికి పలు పౌర సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ధరల పెరుగుదలకు నిరసనగా మెహంగాయి పర్ హల్లాబోల్ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతోంది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడానికి భారత్ జోడో, మెహంగాయి పర్ హల్లాబోల్ కార్యక్రమాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.. ఇందులో కీలక పాత్రలను పోషించనున్నారు. యాత్ర సందర్భంగా అందిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను ఏ రోజుకారోజు సమీక్షించనున్నారు. దీనికోసం ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇక ముందు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉన్న నేపథ్యంలో- సోనియా గాంధీ తన ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టారు. హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉంటారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ దేశానికి వెళ్తారనేది వెల్లడించలేదు. మున్ముందు కీలక కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.