భారత ఉపఖండంలోకి ప్రవేశించిన రుతుపవనాలు, ముందుగానే వర్షాలు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మరో 48 గంటల్లో రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి.
ఈ నెల 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఆ తర్వాత జూన్ తొలివారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రానున్నాయి. అదేవిధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో పలుచోట్ల, ఉత్తర అండమాన్ సముద్రం, అండమాన్లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి.
రుతుపవనాల విస్తరణకు దేశంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1,2 తేదీల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది. అయితే ఈసారి రెండు రోజుల ముందే రుతుపవనాలు రానున్నాయి.
ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు రావాల్సిన సమయానికన్నా ముందే వస్తున్నా తక్కువ స్ధాయిలో వర్షాలు కురుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.