బీఎస్పీకి ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్లే ! : మాయావతిపై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో హీట్ పుట్టిస్తున్నారు. అధికార బీజేపీకి కళ్లెం వేసి యూపీ పీఠాన్ని దక్కించుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. నాలుగో దశ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ పై నేతలు దృష్టి పెట్టారు.

ఎన్నికల తర్వాత బీజేపీ పక్షాన మాయావతి
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఆ పార్టీకి ఓటు వేసి వృధా చేసుకోవద్దని ప్రజలను కోరారు. ఎన్నికల తర్వాత కమలం పార్టీ పక్షాన చేరుతుందని ఆరోపించారు. సందిలాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఎస్పీ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు పోటీ
ఏనుగు స్వారీ చేసేవారు ఎక్కడికైనా వెళ్లగలరని బీఎస్పీని ఉద్దేశిస్తూ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. వారి గురువులు ఇప్పటికే బీజేపీలో ఉన్నారని చురకలంటించారు. యూపీలో అధికారాన్ని చేపట్టేది సమాజ్ వాదీ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఈ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తుందని ఆరోపించారు. ప్రజల పక్షాన ఉండేది సమాజ్ వాదీ పార్టయేనని అఖిలేష్ స్పష్టం చేశారు.
Recommended Video

ఫిబ్రవరి 23న నాలుగో దశ పోలింగ్
ఫిబ్రవరి 23న నాలుగో దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 9జిల్లాల్లోని 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగో దశలో మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. నాలుగో దశ పోరును అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.












Click it and Unblock the Notifications