దేశాన్ని లూటీ చేశారు.. ఇక ఆటలు సాగవు.. ఓటమి భయంతోనే దాడుల డ్రామాలు : అఖిలేశ్ యాదవ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సమాజవాదీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. విమర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల సమరాన్ని రక్తికట్టిస్తున్నారు. బీజేపీ నేతలపై ఎస్పీ కార్యకర్తలు దాడులు చేశారంటూ కాషాయదళం చేసిన ఆరోపణలకు ఆపార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్టాంగ్గా కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతోనే వాళ్లకు వాళ్లే దాడులు చేసుకుని.. తమ పార్టీపై తోయాలని చూస్తున్నారని ఎదురుదాడికి దిగారు.
ఓటమి భయంతో బీజేపీ
యూపీలో బీజేపీ నేతల డ్రామాలకు కొదవులేదని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పూర్తయిన రెండు దశల పోలింగ్లో ఎస్పీ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారని పేర్కొన్నారు. ఇక ఓటమి తప్పదన్న భయంతోనే యూపీలో బీజేపీ నేతలు కొత్త డ్రామాలకు తెరతీశారని అఖిలేశ్ విమర్శించారు.
శాంతి భద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ? ..
బీజేపీ నేతలు, కార్యకర్తలపై ఎస్పీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారనేది అవాస్తవం అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఒకవేళ తమ పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడితే.. యోగి ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. అసలు శాంతి భద్రతలు ఎవరి చేతుల్లో ఉన్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
దేశాన్ని బీజేపీ లూటీ ?
కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చాకే బ్యాంకులు దివాలా తీశాయని అఖిలేశ్ ఆరోపించారు. దేశాన్ని బీజేపీ నేతలు లూటీ చేస్తున్నారని విమర్శించారు.మూడో కంటికి తెలియకుండానే ప్రభుత్వ సంస్థల్ని అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ పాలనలో ఇప్పటికే దేశం తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. కాషాయ పార్టీకి అధికార పీఠం నుంచి దించితేనే దేశానికి మంచిరోజులు వస్తాయని విమర్శలుగుప్పించారు. బీజేపీ పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అఖిలేష్ పేర్కొన్నారు.