షాక్: అఖిలేష్ యాదవ్ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా ?
లక్నో: తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను ఎదిరించి సమాజ్ వాదీ పార్టీ పై పూర్తి ఆధిపత్యం సాధించిన అఖిలేష్ యాదవ్ ఇప్పుడు ఎన్నికల పొత్తుపై దృష్టిసారించారు. దూకుడు మీద ఉన్న బీజేపీని, ప్రచార పర్వంలో దూసుకుపోతున్న బీఎస్పీని గట్టిగా ఎదుర్కొనేలా ప్లాన్ వేస్తున్నారు.
ఇటీవల కాలంలో రాజకీయ విశ్లేషకులు ఊహించినట్లే అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొవడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ వచ్చిన వెంటనే ఈ విషయంపై స్పష్టత వస్తుందని సమాజ్ వాదీ పార్టీ నాయకులు అంటున్నారు..
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ గా అఖిలేష్ యాదవ్ ఢిల్లీ వెళ్లి జనవరి 9వ తేది రాహుల్ గాంధీతో భేటీ అవుతారని, వెంటనే ఇరువురు నేతలు పొత్తు విషయంపై ప్రకటన విడుదల చేస్తారని విశ్వసనీయ సమాచారం.
యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 95 నుంచి 110 స్థానాల్లో పోటీ చేయనుందని సమాచారం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ రహస్యంగా భేటీ అయ్యారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ తో ఎస్పీ పొత్తు కుదుర్చుకుందని సమాచారం.
అయితే రాహుల్ గాంధీ వచ్చిన తరువాత మరో సారి చర్చించి ప్రకటన విడుదల చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది. దళిత, మైనారిటీ ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఉత్తమ ఫలితం వస్తుందని అఖిలేష్ యాదవ్ నమ్మకం.
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపీ, బీఎస్పీని ఒకే సారి దెబ్బకొట్టడానికి చక్కిటి అవకాశం అని అఖిలేష్ యాదవ్ అనుచరులు అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎంత త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే అంతమంచిదని ఇరు వర్గాలు భావిస్తున్నాయి.