పాకిస్తాన్ బెంగ తీర్చిన కేంద్రం- అనుకోని విధంగా.. !!
జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తోన్నాయి. అనేక చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. ఈ కారణంగా అక్కడి ప్రధాన జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రఖ్యాత సలాల్ డ్యామ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. క్యాచ్మెంట్ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులోకి ఊహించని రీతిలో ఇన్ ఫ్లో పెరిగింది.
డ్యామ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని జలాశయం గరిష్ట నీటి మట్టాన్ని క్రమబద్ధీకరించడానికి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సలాల్ డ్యామ్కు చెందిన పలు స్పిల్వే గేట్లను ఎత్తివేశారు. రిజర్వాయర్ కు వస్తున్న నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తోన్నారు. డ్యామ్ గేట్లు తెరిచిన నేపథ్యంలో చీనాబ్ నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను స్థానిక యంత్రాంగం హెచ్చరించింది.

నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. నదీ గర్భంలోకి లేదా తీర ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని పశువుల కాపరులు, స్థానికులకు స్పష్టం చేశారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. నదీ తీరంలో పర్యవేక్షణ పెంచాల్సిందిగా స్థానిక పోలీసులను ఆదేశించారు.
సలాల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్.. జమ్మూ కాశ్మీర్ కు అత్యంత కీలకమైన విద్యుత్ వనరు. 690 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ అందుతోంది. అధిక వర్షాల వల్ల వరద నీటితో పాటు కొండ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బురద, ఇతర వ్యర్థాల వల్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తోన్నారు.
#WATCH | Reasi, J&K | Multiple spillway gates of the Salal Dam have been opened after a significant increase in water inflow was recorded due to recent rainfall in the catchment areas. pic.twitter.com/CCRfG7XqOa
— ANI (@ANI) July 9, 2026
పర్వత ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల తీవ్రత కారణంగా నదిలో నీటి వేగం విపరీతంగా పెరిగింది. రానున్న 24 నుండి 48 గంటల్లో ఎగువ ప్రాంతాల నుండి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అంచనా వేస్తోంది. ఈ మేరకు డ్యామ్ ఇంజినీరింగ్ విభాగం నీటి విడుదలను ఎప్పటికప్పుడు రీక్యాలిక్యులేట్ చేస్తూ గేట్ల ఎత్తును సర్దుబాటు చేస్తోంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కాగా.. ఈ నీరు మొత్తం కూడా పాకిస్తాన్ కు చేరుతుంది. సింధు జలాల ఒప్పందంలో చీనాబ్ నది కీలకం. ఈ ఒప్పందం పరిధిలోకి వచ్చే చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ రిజర్వాయర్ గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సాగు నీటి అవసరాల కోసం పాకిస్తాన్ ఈ నది ప్రవాహంపైనే ఎక్కువగా ఆధారపడుతుంటుంది. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటి వినియోగ హక్కులను భారత్, పాకిస్తాన్ మధ్య విభజించారు.
సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పాక్ స్వస్తి పలికే వరకు ఈ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ గత ఏడాది ప్రకటించింది. నీటి మట్టం భారీగా పెరగడంతో అదనపు జలాలను విడుదల చేయక తప్పట్లేదు. ఇదివరకు ఇదే చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ డ్యామ్ గేట్లను కూడా అధికారులు ఎత్తివేసిన విషయం తెలిసిందే.













Click it and Unblock the Notifications