తప్పేముంది: మోడీ వ్యాఖ్యలకు శ్రీశాంత్ మద్దతు
తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోడీ చేసిన 'సోమాలియా' వ్యాఖ్యలకు రాజకీయ నాయకుడిగా మారిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ మద్దతు పలికారు. ఆయన లేవనెత్తిన అంశం చాలా సున్నితమైందని, దాన్ని అర్థం చేసుకోకుండా కేరళను సోమాలియాతో పోల్చారని అంతా విమర్శించడం సరికాదని అన్నారు.
తాను నరేంద్ర మోడీకి మద్దతుగా నిలుస్తున్నానని చెప్పారు. ప్రధాని మోడీ.. మొత్తం కేరళను సోమాలియాతో పోల్చలేదన్నారు. కేరళలోని దళితులు నివసిస్తున్న ప్రాంతాల్లో శిశుమరణాల రేటు అధికంగా ఉందన్నారని తెలిపారు.
'అది సోమాలియాలోలాగ ఇక్కడ కూడా చాలా పెద్ద సమస్య' అని మోడీ అన్నారని ఆయన చెప్పారు. అది అర్థం చేసుకోకుండా.. సోషల్మీడియాలో, కేరళలో మోడీ వ్యాఖ్యలను పలువురు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
కాగా, కేరళలో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 19న ఫలితాలు విడుదల అవుతాయి. అక్కడ శనివారంతో అక్కడ ప్రచారం ముగిసింది.