"ఏపీలో మంత్రులపై పోలీసుల నిఘా ? వారిపై మాత్రం పెట్టరు"- టీజీ భరత్ కామెంట్స్..!
కర్నూల్లో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై స్థానిక మంత్రి టీజీ భరత్ (TG Bharat) తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన ఆయన్ను, అప్పట్లో దాన్ని వెనక్కి తీసుకోవాలని బెదిరించారని, ఆ తర్వాత ఇంటికెళ్లి గొడవ కూడా చేశారని, ఇప్పుడు ఏకంగా హత్య చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతల ఒత్తిడి తర్వాత ఇంతియాజ్ టీడీపీలో చేరారని భరత్ గుర్తుచేశారు.
కర్నూలులో రౌడీలు రెచ్చిపోతున్నారని, హత్యలకు తెగబడుతున్నారని మంత్రి భరత్ ఆరోపించారు. ఇంతియాజ్ హత్య గురించి వారం క్రితమే సోషల్ మీడియాలో సమాచారం వచ్చిందని, అయినా పోలీసులు ఏం చేస్తున్నారని మంత్రి భరత్ నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై రౌడీలు నిఘా పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. మంత్రులపై నిఘా పెట్టే పోలీసులు, నేరస్థులపై నిఘా పెట్టలేరా అని భరత్ సూటిగా ప్రశ్నించారు.

ఇంతియాజ్ హత్య వెనుక విపక్ష వైసీపీ హస్తం ఉందని మంత్రి భరత్ ఆరోపించారు. హత్యకు గురైన ఇంతియాజ్ హంద్రీనదిలో వైసీపీ కబ్జాలను బయట పెట్టారని తెలిపారు. ఆది మనసులో పెట్టుకుని ఇంతియాజ్ను దారుణంగా హత్య చేశారని భరత్ ఆరోపించారు. కర్నూల్లో తనకు అందుతున్న సమాచారం కూడా పోలీసులకు అందడం లేదని మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్ధం కావడం లేదన్నారు. మంత్రులు ఎక్కడికెళ్తున్నారో పక్కాగా నిఘా పెడుతున్న పోలీసులు .. రౌడీ షీటర్లపై మాత్రం ఎందుకు నిఘా పెట్టడం లేదని ప్రశ్నించారు.




Click it and Unblock the Notifications