వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకాంత్ బొల్లా: ఒక అంధుడు రూ. 400 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన శ్రీకాంత్ బొల్లా జీవితంపై బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. అంధుడైన ఈ యువ సీఈవో, 48 మిలియన్ యూరోల (సుమారు రూ.400 కోట్లు) విలువైన కంపెనీని సృష్టించారు.

విద్యార్ధిగా ఉన్న రోజుల్లో సైన్స్, మ్యాథ్స్ చదవడానికి అర్హుడు కాదని, శ్రీకాంత్ చదువుకుంటున్న విద్యా సంస్థ తేల్చి చెప్పింది. దీంతో ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీదే కేసు వేసి విజయం సాధించారు.

srikanth

ఆరేళ్ల వయసులో శ్రీకాంత్ ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవారు. అతని సోదరులు, క్లాస్‌మేట్లు ఆయన్ను చేయిపట్టుకుని స్కూలుకు తీసుకెళ్లే వారు. స్కూలుకు వెళ్లే దారంతా చెత్తా చెదారం, చెట్లు చేమలతో నిండి ఉండేది. వర్షాకాలం వస్తే ఇబ్బందులు రెట్టింపయ్యేవి.

''నేను అంధుణ్ని కావడంతో నాతో ఎవరూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు'' అన్నారు శ్రీకాంత్.

నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ సమాజం నుంచి అనేకసార్లు తిరస్కారాలు ఎదుర్కొన్నారు.

''కుక్క ఇంట్లోకి వెళ్లిందని కూడా తెలుసుకోలేని నేను ఇంటి కాపలాకు కూడా ఉపయోగపడనని కొందరు మా అమ్మా నాన్నలకు చెప్పేవారు'' అన్నారాయన.

ముఖం మీద దిండుతో నొక్కి నన్ను చంపేయమని చాలామంది నా తల్లిదండ్రులకు సలహా ఇచ్చేవారని శ్రీకాంత్ వెల్లడించారు.

అయితే, సమాజంలో అనేకమంది అనేక రకాల మాటలన్నా, శ్రీకాంత్ తల్లిదండ్రులు వాటిని పట్టించుకోలేదు. ఆయనకు మద్ధతుగా నిలిచారు. 8 ఏళ్ల వయసులో ఆయనకో గుడ్ న్యూస్ వినిపించింది. అంధ విద్యార్ధులు చదువుకునే బోర్డింగ్ స్కూలులో శ్రీకాంత్‌కు సీటు లభించింది. దీంతో తన సొంత ఊరికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు చేరుకున్నారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఇంకా విడిపోలేదు.

తల్లిదండ్రులకు దూరమైనా, స్కూల్లో చాలా ఉత్సాహంగా గడిపేవారు శ్రీకాంత్. ఈత కొట్టడం, చెస్, క్రికెట్ లాంటి ఆటలన్నీ నేర్చుకున్నారు. శబ్ధం చేసే బంతితో ఆయన క్రికెట్ ఆడగలిగేవారు.

''అదంతా చెయ్యి, చెవికి సంబంధించిన వ్యవహారం'' అన్నారు శ్రీకాంత్

బోర్డింగ్ స్కూల్లో శ్రీకాంత్ తన హాబీలను ఆస్వాదించారు. అదే సమయంలో భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం ప్రారంభించారు. ఇంజినీర్ కావాలన్నది ఆయన కల. అది జరగాలంటే సైన్స్, మ్యాథ్స్ చదవాలని ఆయనకు తెలుసు.

కోరుకున్నట్లుగానే ఆయన మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను ఎంచుకున్నారు. కానీ, ఆ సబ్జెక్టులు తీసుకోవడానికి నీకు అర్హత లేదంటూ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. అయితే, ఇది చట్ట విరుద్ధమని శ్రీకాంత్ వాదించారు.

శ్రీకాంత్ చదివే స్కూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మండలి పరిధిలో ఉంటుంది. అంధులైన సీనియర్ విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ తీసుకోవడానికి ఈ మండలి నియమాల ప్రకారం వీలుకాదు. ఈ సబ్జెక్టులలో డయాగ్రామ్‌లు, గ్రాఫ్‌లు ఉంటాయి కాబట్టి, వీటిని అంధులైన విద్యార్ధులు చదవలేరంటూ వీటికి వారిని అనర్హులుగా పేర్కొంది.

దీనికి బదులుగా వారు, ఆర్ట్స్, లాంగ్వెజ్, లిటరేచర్, సోషల్ సైన్సెన్స్‌లను ఎంచుకోవచ్చు. ఈ ఘటనలు 2007లో జరిగాయి.

విద్యా మండలిపై న్యాయపోరాటం

అన్ని పాఠశాలలకు ఒకే రూల్ లేని ఈ వ్యవస్థపై శ్రీకాంత్ ఆగ్రహించారు. ఆయనకు టీచర్‌గా వ్యవహరించిన తక్కెళ్లపాటి స్వర్ణలత కూడా శ్రీకాంత్‌కు ఈ సబ్జెక్టులు చదివే అవకాశం లేనందుకు తీవ్ర నిరాశ చెందారు. దీనిపై ఏదో ఒకటి చేయాలంటూ ఆమె శ్రీకాంత్‌‌ను ప్రోత్సహించారు.

వీరిద్దరు తమ వాదనను వినిపించడానికి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు వెళ్లారు. కానీ, నిబంధనలు అలా ఉన్నాయని, తామేమీ చేయలేమని అక్కడి అధికారులు చెప్పారు.

నిరాశ చెందని శ్రీకాంత్, స్వర్ణలత ఒక లాయర్‌ను సంప్రదించారు. అంధ విద్యార్థులను మ్యాథ్స్, సైన్స్ చదవేందుకు అనుమతిచ్చేలా విద్యా చట్టాన్ని మార్చాలని విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు.

కేసు నడుస్తున్న కాలంలోనే, శ్రీకాంత్‌కు ఒక వార్త తెలిసింది. హైదరాబాద్‌లోని చిన్మయ విద్యాసంస్థ వేరే విద్యామండలి ఆధ్వర్యంలో నడుస్తోందని, అక్కడ అంధ విద్యార్ధులకు మ్యాథ్స్, సైన్సు బోధిస్తారని తెలిసింది. వెంటనే శ్రీకాంత్ అందులో చేరారు.

క్లాస్‌ మొత్తంలో తానొక్కరే అంధ విద్యార్ధి. ''కానీ వారంతా నన్ను ముక్తకంఠంతో స్వాగతించారు'' అని శ్రీకాంత్ వివరించారు.

''మా క్లాస్ టీచర్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆమె నాకు చేయగలిగిన సాయమంతా చేసేవారు. స్పర్శ సాయంతో డయాగ్రామ్‌లు ఎలా గీయాలో ఆమె నేర్పారు'' అన్నారు శ్రీకాంత్.

ఒక్క రబ్బర్ మ్యాట్‌ పై పెన్ను లేదా పెన్సిల్‌తో గట్టిగా గీసినప్పుడు ఆ లైన్ పేపరు మీద ఉబ్బెత్తుగా మారుతుంది. చేతితో తాకి ఆ లైన్‌ను తెలుసుకోవచ్చు.

ఆరు నెలల తర్వాత కోర్టు నుంచి తీర్పు వచ్చింది. శ్రీకాంత్ తాను వేసిన కేసులో గెలిచారు. అంధ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్టేట్ బోర్డ్ స్కూల్స్‌లో సైన్స్, మ్యాథ్స్ చదవడానికి అర్హులని కోర్టు తీర్పు చెప్పింది.

''నేను సాధించగలనని ఈ ప్రపంచానికి నిరూపించడానికి నాకు మొదటి అవకాశం వచ్చింది. నేటి యువతరం కేసులు దాఖలు చేయడం, కోర్టు ద్వారా పోరాడటంలో భయపడాల్సింది ఏమీ లేదు'' అని ఆయన చెప్పారు.

'చిరు మొక్కపై పెను తుపాను'

శ్రీకాంత్ వెంటనే స్టేట్ బోర్డ్ స్కూల్‌కి తిరిగి వచ్చారు. తనకిష్టమైన సైన్సు, మ్యాథ్స్‌లు చదువుకుని 98% మార్కులు సాధించారు. ఐఐటీలో సీటు సంపాదించాలన్నది ఆయన లక్ష్యం. వీటిలో ప్రవేశానికి పోటీ తీవ్రంగా ఉంటుంది. ఎంట్రన్స్ కోసం విద్యార్థులు కోచింగ్‌ తీసుకునేవారు. కానీ, శ్రీకాంత్ అంధుడు కావడంతో ఆయన్ను కోచింగ్ క్లాసుల్లో చేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు.

''ఈ కోర్సు కోచింగ్ చాలా తీవ్రంగా ఉంటుందని, ఒక చిరు మొక్కపై పెను వర్షం కురిసినట్లుగా ఉంటుందని కొన్ని ఇన్‌స్టిట్యూట్లు నాకు చెప్పాయి. నేను అకడమిక్ స్టాండర్డ్‌ను అందుకోలేనని వారు భావించేవారు'' అన్నారు శ్రీకాంత్.

''నేనేమీ బాధపడలేదు. నన్ను ఐఐటీ కోరుకోకపోతే, నాకు కూడా ఐఐటీ అక్కర్లేదు'' అని అనుకున్నట్లు శ్రీకాంత్ చెప్పారు.

అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఐదు యూనివర్సిటీల నుంచి ఆయనకు ఆఫర్‌లు వచ్చాయి. మసాచుసెట్స్‌లోని ఎంఐటీ (మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని ఆయన ఎంచుకున్నారు.

అక్కడ సీటు పొందిన మొట్టమొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి అయ్యారు శ్రీకాంత్. ఆరంభంలో యూనివర్సిటీలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.

''అక్కడున్నంత చలిని నేనెప్పుడూ అనుభవించ లేదు. తిండి కూడా భిన్నమైన వాసన, రుచి ఉండేది. మొదటి నెలంతా ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ ఫింగర్స్ మాత్రమే తిన్నా'' అని వివరించారు.

తర్వాత అక్కడి వాతావారణానికి, ఆహారానికి అలవాటు పడ్డారు.

''ఎంఐటీలో ఉన్నప్పటి నా జీవితం అత్యంత అందమైన కాలం'' అన్నారు శ్రీకాంత్.

చదువుకుంటున్న సమయంలోనే 'సమన్వయి సెంటర్ ఫర్ చిల్డ్రన్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్’ అనే స్వచ్ఛంద సంస్థను హైదరాబాద్‌లో ప్రారంభించారు. అంగవైకల్యం ఉన్న వారికి విద్యనందించడం, శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన ఆశయాలు. నిధులు సేకరించి బ్రెయిలీ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారాయన.

ఎంఐటీలో మేనేజ్‌మెంట్ సైన్స్‌లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. జాబ్ కూడా సంపాదించారు. కానీ, అమెరికాలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఆయనకు తన స్కూల్ రోజులు గుర్తొచ్చాయి. తాను చేయవలసిన పని అసంపూర్తిగా ఉన్నట్లు శ్రీకాంత్ భావించారు.

"జీవితంలో ప్రతిదానికీ నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. అందరూ నాలా పోరాడలేరు. లేదంటే నాకు దొరికిన గురువుల్లాంటి వారిని పొందలేరు'' అన్నారాయన.

విశాల దృష్టితో చూస్తే అంగ వికలురకు ఉద్యోగాలే లేనప్పుడు, వారికి చదువు కోసం పోరాటడం అర్ధం లేనిదని ఆయన భావించారు.

''నేనే సొంతంగా కంపెనీ ఎందుకు స్థాపించకూడదు, వికలాంగులకు ఎందుకు ఉపాధి కల్పించకూడదు'' అని శ్రీకాంత్ ఆలోచించారు.

2012లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన శ్రీకాంత్, బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించాడు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ, తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. దీని విలువ సుమారు రూ.480 కోట్లు.

ఈ సంస్థ వీలైనంత ఎక్కువమంది వికలాంగులకు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఉద్యోగాలిచ్చింది. కరోనా మహమ్మారికి ముందు మొత్తం 500 మంది సిబ్బందిలో 36% మంది వికలాంగులు ఉండేవారు.

మరింత ముందుకు...

30 సంవత్సరాల వయసున్న శ్రీకాంత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్స్-2021 జాబితాలోకి ప్రవేశించారు. మూడు సంవత్సరాలలో తన బొల్లాంట్ ఇండస్ట్రీస్ కంపెనీ గ్లోబల్ ఐపీఓ అవుతుందని ఆయన నమ్మకంతో ఉన్నారు. ఈ కంపెనీ షేర్లు ఒకేసారి అనేక అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి.

ఇప్పుడు బాలీవుడ్ కూడా శ్రీకాంత్ పేరును స్మరిస్తోంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో రాజ్‌కుమార్ రావు నటిస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది.

ఈ సినిమాతో తనను మొదటిసారి కలిసిన వారు తక్కువ అంచనా వేయడం మానేస్తారని శ్రీకాంత్ ఆశిస్తున్నారు.

''మొదట్లో జనం పాపం అంధుడు అని బాధపడిపోతారు. కానీ, నేనేంటో తెలిసిన తర్వాత అన్నీ మారిపోతాయి’’ అన్నారు శ్రీకాంత్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Srikanth Bolla: A blind man establishes 400 crore business empire how
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X