నరేంద్ర మోడీ ర్యాలీ: కూలిన వేదిక, ముగ్గురికి గాయాలు
లక్నో: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ర్యాలీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సికిందర్పూర్లో ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కళాకారులు పాటలు పాడుతున్న సమయంలో వేదిక కూలడంతో ముగ్గురికి గాయాలయ్యాయి.
సలేంపూర్ లోకసభ బిజెపి అభ్యర్థి రవీంద్ర కుష్వా తరపున నరేంద్ర మోడీ ర్యాలీలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. కాగా, కళాకారుల కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు ఎక్కడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.
నరేంద్ర మోడీ వేదిక వద్దకు వస్తున్నారనగా అధిక సంఖ్యలో సంఖ్యలు కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కమలేష్ (18), లక్ష్మి (13), అషుతోష్ (20) ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కాగా, లక్ష్మి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. నియమనిబంధనల ప్రకారం వేదికను రూపొందించని కారణంగానే కూలిపోయిందని, నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు ఎస్పి కెసి గోస్వామి మీడియాకు తెలిపారు.